ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా ఘోరంగా వైఫల్యమైన నేపథ్యంలో బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్లో ప్రక్షాళనే లక్ష్యంగా 10 పాయింట్లతో కూడిన రూల్స్ ను రూపొందించి, అవి కచ్చితంగా పాటించాలని ఆటగాళ్లను ఆదేశించింది. తాజాగా దీనిపై స్పందించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏం అన్నాడంటే?
బీసీసీఐ రూపొందించిన రూల్స్ లో.. క్రికెటర్స్ కుటుంబ సభ్యుల గురించి కూడా ఉంది. విదేశీ పర్యటనలు చేసేటప్పుడు.. క్రికెటర్స్ వెంటపెట్టుకుని తీసుకెళ్లిన ఫ్యామిలీ మెంబర్ నిర్ణీత సమయం మాత్రమే ఉండాలని పరిమితులు విధించింది. లాంగ్ టూర్ సమయంలో భార్య, పిల్లలు కేవలం రెండు వారాలు మాత్రమే ఉండాలని, అదే తక్కువ వ్యవధి ఉన్న పర్యటనలో వారం రోజులు మాత్రమే ఉండాలని నిబంధనలను జారీ చేసింది బోర్డు.
తాజాగా ఈ విషయంపై విరాట్ మాట్లాడుతూ.. "మనకు తీవ్రమైన పరిస్థితులు ఎదురైనప్పుడు తిరిగి కుటుంబసభ్యులకు చేరడం ఎంతో ఊరటనిస్తుంది. ఆ సమయంలో వారి మద్దతు మనందరికి తప్పనిసరిగా కావాలి. దీని గురించి కొంతమందికి వివరించడం కూడా చాలా కష్టం. దీని గురించి తెలియని వ్యక్తులు కూడా.. క్రికెటర్లను కుటుంబాలకు దూరంగా ఉంచాల్సిన అవసరముందని అంటుంటారు. అది నన్ను కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయినా పర్యటనలో ఉన్నప్పుడు ఆటలో రాణించలేకపోయినా ఆటగాడు ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడడు.ఆట అనేది ఓ బాధ్యత. దాన్ని పూర్తి చేశాకే వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తాం. నేనైతే బయటకు వెళ్లి నా ఫ్యామిలీతో గడిపే సమయాన్ని, అవకాశాలను వదులుకోను" అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
