Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభంలో తనపై ప్రభావం చూపిన వ్యక్తి గురించి గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మార్క్ బౌచర్తో జరిగిన సంభాషణలు తనను స్టన్ చేశాయని విరాట్ అన్నాడు.
"నా కెరీర్ ప్రారంభంలో ఆడిన ప్లేయర్లలో.. బౌచర్ నా మీద ఎక్కువ ప్రభావం చూపిన వ్యక్తి. అతడితో మాట్లాడిన సందర్భాలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. అతడు చెప్పిన విషయాలు ఎంతో ఆలోచించదగినవిగా, ప్రోత్సాహించేలా, ఆశ్చర్యకరంగా ఉండేవి. అతడి మాటలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. నేనేమి అడగకుండానే నాలోని బలహీనతలను ఎత్తి చూపేవాడు. నేను నెక్స్ట్ లెవల్కు వెళ్లాలంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది సలహాలు ఇచ్చేవాడు. అతడి ఆలోచనలు నన్ను ఆశ్చర్యపరిచేయి. అతడు అప్పుడు నాతో అన్న మాటలను నేను మరిచిపోలేను. 'నేను ఇప్పుడు నుంచి మరో 3-4 ఏళ్ల పాటు కామెంటేటరీ కోసం ఇండియాకు వచ్చాను అనుకో, అప్పుడు నువ్వు భారత్ తరఫున ఆడటం నేను చూడకపోతే, నీకు నువ్వే అన్యాయం చేసినట్టవుతుంది' అని నాతో అన్నాడు. ఆ మాటలు నిజంగా నన్ను షాక్కు గురిచేశాయి" అని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.
కాగా, బౌచర్ ఆర్సీబీ తరఫున 2008-10వరకు ఆడాడు. అప్పుడే కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్ వైపు మెలమెల్లగా అడుగులేస్తున్నాడు. అప్పటికీ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం కూడా చేయలేదు. బౌచర్ 27 మ్యాచులు ఆడి 29.85 సగటుతో ఓ హాఫ్ సెంచరీతో 388 పరుగులు చేశాడు.

అభిమానుల ప్రేమ కన్నా...
ఐపీఎల్ గత 18 ఏళ్లుగా ఒక్కటే ఫ్రాంఛైజీ (ఆర్సీబీ) తరఫున ఆడుతున్నాడు కోహ్లీ."ఈ ఫ్రాంచైజీతో నాకు ఉన్న సంబంధం, పరస్పర గౌరవం వల్లే ఈ ఫ్రాంఛైజీతో కొనసాగుతున్నాను. అదే నాకు ఎంతో విలువైనవి," అని విరాట్ అన్నాడు. అభిమానుల ప్రేమ గురించి మాట్లాడుతూ.. "నాకు అభిమానుల నుంచి దక్కే ప్రేమను ఏ ట్రోఫీ కూడా సమం చేయలేదు. వాళ్ల ప్రేమ నాకు ఎంతో అమూల్యమైనది" అని పేర్కొన్నాడు.
ఏదీ మారలే...
టీ20 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తనకు ఐపీఎల్లో ఎలాంటి మార్పు కనిపించలేదని అన్నాడు విరాట్. "నాకు ఏది మారినట్టు అనిపించదు. టీ20 రిటైర్మెంట్ పూర్తిగా ఆలోచించే తీసుకున్నా. ఇప్పుడు భారత్ కోసం ఆడేందుకు కొత్త తరం ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. వాళ్లకు సమయం ఇవ్వాలి. వాళ్లు రెండేళ్ల పాటు క్రికెట్ సైకిల్లో ఆడాలి, ప్రయాణించాలి, ఒత్తిడిని ఎదుర్కోవాలి, వేర్వేరు దేశాల్లో ఆడాలి, విభిన్న పరిస్థితుల్లో మ్యాచ్లు ఆడాలి. అప్పుడే ప్రపంచకప్ వచ్చేసరికి వాళ్లు పూర్తిగా సిద్ధమవ్వగలరు." అని కోహ్లీ వివరించాడు.