మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ తమ జట్లను బలోపేతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. రిటైన్డ్ ప్లేయర్ల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ను వచ్చే సీజన్ నుంచి సారథిగా కాకుండా కేవలం జట్టులోనే కొనసాగించాలని ప్లాన్ చేస్తోంది.
ఐపీఎల్-2024 సీజన్లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఘోర పరాజయాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ను పబ్లిక్గా లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా తిట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అప్పటి నుంచి రాహుల్ లక్నో జట్టును వీడనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆ తర్వాత సంజీవ్.. రాహుల్ను తన ఇంటికి ఆహ్వానించడంతో ఆ రచ్చకు తాత్కాలిక ముగింపు పలికింది.

కానీ ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ల మనసత్త్వం గురించి కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఈ టాపిక్ ట్రెండింగ్లోకి వచ్చింది. క్రీడారంగంలో ఓటములు సహజమని, వ్యాపారంతో పోల్చొద్దని రాహుల్ పేర్కొన్నాడు. అయితే ఈ వార్తలు వచ్చిన కొన్ని రోజులకే సంజీవ్ గొయెంకాను రాహుల్ కలవడం గమనార్హం. అయితే ఈ ఇద్దరు సమావేశమైన అనంతరం ఓ వార్త బయటకు వచ్చింది.
కేఎల్ రాహుల్ స్థానంలో నికోలస్ పూరన్ జట్టు బాధ్యతలు అందుకోనున్నాడని సమాచారం. ఈ నిర్ణయం వెనుక రాహులే ఉన్నట్లు తెలుస్తోంది. తన ఆటను మరింత మెరుగుపర్చుకోవడానికి కెప్టెన్సీకి దూరమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక రోహిత్ వారసుడిగా భారత జట్టులో కొత్త కెప్టెన్లు వస్తుండటంతో రాహుల్ కెప్టెన్సీని వదలి బ్యాటింగ్, వికెట్ కీపింగ్పై ఫోకస్ చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పూరన్ను ఓ బ్యాకప్ కెప్టెన్గానే నియమించాలని, మెగా వేలంలో సరైన సారథిని వెతకాలని ఫ్రాంచైజీ చూస్తోందని సమాచారం.