IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో తన పాత జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించి చరిత్ర సృష్టించాడు. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ సాధించి తన పేరిట రికార్డును సృష్టించాడు.
ఐపీఎల్ లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా..
33 ఏళ్ల కేఎల్ రాహుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 5 వేల పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఐపీఎల్ లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేఎల్ రాహుల్ కేవలం 130 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించి ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ రికార్డును బద్ధలు కొట్టాడు. డేవిడ్ వార్నర్ 135 ఇన్నింగ్స్ లలో 5000 పరుగులు పూర్తి చేశాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 157 ఇన్నింగ్స్ లలో 5 వేల ఐపీఎల్ పరుగులు పూర్తి చేశాడు.

ఐపీఎల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
కేఎల్ రాహుల్: 130 ఇన్నింగ్స్
డేవిడ్ వార్నర్: 135 ఇన్నింగ్స్
విరాట్ కోహ్లీ: 157 ఇన్నింగ్స్
ఏబీ డివిలియర్స్: 161 ఇన్నింగ్స్
శిఖర్ ధావన్: 168 ఇన్నింగ్స్
కేఎల్ రాహుల్ ఈ సీజన్లో తన మూడవ అర్ధ సెంచరీ కాగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మొత్తం మీద 48వ అర్ధ సెంచరీ సాధించాడు. కేఎల్ రాహుల్ సిక్స్ కొట్టడం ద్వారా జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. మ్యాచ్ గురించి చెప్పాలంటే, ఢిల్లీ క్యాపిటల్స్ 160 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు, 13 బంతులు మిగిలి ఉండగానే సులభంగా చేరుకుంది. అభిషేక్ పోరెల్ కూడా గొప్ప ఫామ్లో కనిపించాడు. 36 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 20 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ తో 34 పరుగులు చేశాడు.
ముందుగా టాస్ ఓడిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో తరపున ఐడెన్ మార్క్రమ్ అత్యధికంగా 52 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ముఖేష్ కుమార్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు.