ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మార్చి 22 నుంచి ఈ మెగా లీగ్ మొదలు కానుంది. ఇప్పటికే ఈ లీగ్ మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఓ మ్యాచ్ ను రీషెడ్యూల్ చేస్తారని తెలుస్తోంది. ఇంతకీ ఆ మ్యాచ్ ఏంటి?, ఎందుకు రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం తీసుకోబోతున్నారు? వంటి వివరాలను తెలుసుకుందాం..
ఒకే రోజు రెండూ..
ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్ - లఖ్నవూ సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ షెడ్యూల్ చేశారు. కానీ ఇప్పుడీ మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే మ్యాచ్ నిర్వహణ రోజే శ్రీరామ నవమి కూడా ఉంది. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఊరేగింపులు జరుగుతాయి. అంటే అటు ఊరేగింపులకు, ఇటు మ్యాచ్కు.. రెండింటికీ భద్రత కల్పించడం పోలీసులకు పెద్ద సవాల్తో కూడుకున్న పని. ఒకవేళ పోలీసు అధికారులు భారీ స్థాయిలో భద్రత కల్పించలేకపోతే మ్యాచ్ కోసం స్టేడియానికి వచ్చే 65 వేల మంది ప్రేక్షకులను కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అందుకే భద్రతా కారణాల రీత్యా ఆ మ్యాచ్ను రీషెడ్యూల్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. పైగా ఇప్పటికే పోలీసులతో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు స్నేహశీశ్ గంగూలీ కూడా భద్రత అంశాల గురించి మాట్లాడారు. రెండు సార్లు దీనిపై చర్చలు జరిగాయి. అయినా పోలీసుల నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది.

అప్పుడు కూడా ఇదే పరిస్థితి..
అయితే ఏప్రిల్ 6న మ్యాచ్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐదే తుది నిర్ణయమని చెప్పారు లఖ్నవూ సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా. ఇప్పటికే ఈ భద్రత విషయంలో నెలకొన్న సమస్యను బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కాగా, గత సీజన్ లోనూ ఓ మ్యాచ్ విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కేకేఆర్ - రాజస్థాన్ మ్యాచ్ రోజు కూడా శ్రీరామనవమి వచ్చింది. దీంతో ఆ మ్యాచ్ను ఐపీఎల్ కమిటీ రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది.