టీమిండియా హెడ్ కోచ్ పదవికి గుడ్బై చెప్పిన రాహుల్ ద్రవిడ్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. మెగా వేలానికి ముందే అతన్ని దక్కించుకోవాలని కొన్ని జట్లు ప్లాన్ చేస్తున్నాయి. ఐపీఎల్-2025 వేలానికి ముందు మెగా ఆక్షన్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చివర్లో వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి.
వ్యూహాలతో పాటు ఆటగాళ్లను మానసికంగా సన్నద్ధం చేయడంలో ద్రవిడ్ దిట్ట. అతని కోచింగ్లో టీమిండియా ఎన్నో ఘనతలు సాధించిన విషయం తెలిసిందే. భారత జట్టును 2022 టీ20 వరల్డ్ కప్లో సెమీస్కు, 2023 వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు, అలాగే 2024 టీ20 వరల్డ్ కప్లో విజేతగా నిలవడంలో ద్రవిడ్ది ప్రధాన పాత్ర.

అందుకే ద్రవిడ్ కోసం ఐపీఎల్ ప్రాంఛైజీలు విపరీతంగా పోటీపడుతున్నాయి. కోచ్గా లేదా మెంటార్గా జట్టులో తీసుకోవాలని చూస్తున్నాయి. అయితే ద్రవిడ్ కోసం అన్ని ఫ్రాంచైజీల కంటే ముందు కోల్కతా నైట్ రైడర్స్ ఓ ముందడుగు వేసింది. ద్రవిడ్ను కేకేఆర్ ఫ్రాంచైజీ సంప్రదించిందని బెంగాల్ మీడియా పేర్కొంది. అయితే కోచ్గా కాకుండా మెంటార్గా బాధ్యతలు అందుకోమని కేకేఆర్ ద్రవిడ్ను కోరిందని సమాచారం. దీని కోసం ద్రవిడ్కు బ్లాంక్ చెక్ కూడా ఆఫర్ చేసిందని స్థానిక మీడియా రాసుకొచ్చింది.
ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. దశాబ్దం తర్వాత విజేతగా నిలిచింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సీజన్ ఆద్యంతం అదరగొట్టింది. కోల్కతా విజయంలో మెంటార్గా గౌతమ్ గంభీర్ కీలకపాత్ర పోషించాడు. అయితే మరికొన్ని రోజుల్లో టీమిండియా కోచ్గా బాధ్యతలు అందుకోనున్న గంభీర్ కేకేఆర్ మెంటార్ బాధ్యతలకు గుడ్బై చెప్పాడు. దీంతో గంభీర్ స్థానంలో ద్రవిడ్ను తీసుకురావాలని కేకేఆర్ ఫ్రాంచైజీ భావిస్తోంది.