IPL 2025 Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ పేసర్, దక్షిణాఫ్రికా స్టార్ కగిసో రబాడ ఐపీఎల్ 2025 నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో తొలి రెండు మ్యాచుల్లో ఆడిన అతడు.. ఏప్రిల్ 3న స్వదేశానికి వెళ్లిపోయాడు. అప్పుడు అతడు వ్యక్తిగత కారణాలతో వెళ్లిపోయాడని ప్రకటన చేశారు.
కానీ అసలు విషయాన్ని ఇప్పుడు బయటపెట్టాడు రబాడ (kagiso rabada). డోపింగ్ కారణంగా తాను ఈ ఐపీఎల్ సీజన్ ను మధ్యలో వీడినట్లు తెలిపాడు. నిషేధిత ఉత్ప్రేరకం (డ్రగ్స్) వాడినందుకుగానూ క్రికెట్ దక్షిణాఫ్రికా తనపై తాత్కాలిక నిషేధం విధించినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ప్రొవిజనల్ సస్పెన్షన్లో ఉన్నట్లు.. త్వరలోనే తిరిగి క్రికెట్ ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు. కాగా, రబాడను గుజరాత్ టైటాన్స్ వేలంలో రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం అతడు భారత్కు తిరిగొచ్చాడని సమాచారం అందింది.
సరదా కోసం చేసి చిందిస్తున్నా.. ''సరదా కోసం డ్రగ్స్ తీసుకున్నాను. దీంతో ఇప్పుడు నిషేధాన్ని ఎదుర్కొంటున్నాను. నేను చేసిన ఈ పనికి చింతిస్తున్నాను. నన్ను క్షమించండి. కానీ నా వ్యక్తిత్వాన్ని ఈ ఉదంతం తేల్చదు. ఆటపై నా ప్రేమ ఏమాత్రం తగ్గదు'' అని రబాడా వివరణ ఇచ్చాడు.

అప్పుడే జరిగిందలా.. జనవరి-ఫిబ్రవరి నెలలో నిర్వహించిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్ సమయంలో రబాడాపై టెస్టులు నిర్వహించారు. అందులోనే అతడు డోపీగా తేలాడు. వరల్డ్ యాంటీ డోపింగ్ సిస్టమ్ (వాడా) నిబంధనల ప్రకారం రబాడకు కనీసం మూడు నెలల నుంచి నాలుగేళ్ల శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే అతడు ఆట కోసం ఈ డ్రగ్స్ తీసుకోలేదని నిరూపిస్తే మాత్రం మూడు నెలల శిక్ష మాత్రమే విధిస్తారు. చూడాలి మరి ప్రపంచ డోపింగ్ నిరోధక వ్యవస్థ అతడికి ఎలాంటి శిక్ష విధిస్తుందో.. ఇక ఇదే విషయంపై ఐసీసీ చర్యలు తీసుకున్నా కూడా.. రబాడ జూన్లో ఆస్ట్రేలియాతో జరగబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు కూడా దూరం అవ్వొచ్చు.