IPL 2025: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-1 తొలి జట్టు నిర్ణయం జరిగిపోయింది. పంజాబ్ కింగ్స్ మే 29న వారి సొంత మైదానం ముల్లన్పూర్ లో మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్కు చేరుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన హార్ధిక్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో 9 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.
పంజాబ్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్లు అద్భుతంగా రాణించారు. వారిద్దరు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ప్రియాన్ష్ ఆర్య 35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 62 పరుగులు చేశాడు. జోష్ ఇంగ్లిస్ 42 బంతుల్లో 9 ఫోర్లు,3 సిక్సులతో 73 పరుగులు చేశాడు. మరో వైపు పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(13), శ్రేయస్ అయ్యర్(26*), నేహాల్ వధేరా(2*) పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీశాడు. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ముంబై తరఫున సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 57 పరుగులు చేసి ముంబై జట్టును మంచి స్థాయిలో నిలబెట్టాడు. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(27), రోహిత్ శర్మ(24) పరవాలేదనిపించారు. హార్దిక్ పాండ్యా(26), నమన్ ధీర్(20), విల్ జాక్స్(17) పరుగులు చేశారు. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(1) దారుణంగా నిరాశపరిచాడు. బంజాబ్ కింగ్స్ బౌలర్లలో మార్కో యాన్సెన్, అర్ష్దీప్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హర్ ప్రీత్ బ్రార్ ఒక వికెట్ తీశాడు.