IPL 2025: ఐపీఎల్ 2025లో ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు 12 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్ మధ్య జరిగిన పోరాటం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ మ్యాచ్ లో వారిద్ధరి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. పవర్ ప్లేలో బుమ్రా బౌలింగ్ లో కరుణ్ నాయర్ రెండు సిక్సులు, ఫోర్ తో సహా 18 పరుగులు బాదాడు.
బుమ్రా ఓవర్ చివరి బంతికి కరుణ్ నాయర్ రెండు పరుగులు తీస్తూ బుమ్రాను ఢీకొన్నాడు. ఈ క్రమంలోనే ఇరువురు వాగ్వాదానికి దిగారు. కరుణ్ నాయర్ క్షమాపణలు చెప్పినా జస్ప్రీత్ బుమ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరకు అంపైర్లు కలగజేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, చిత్రాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్ల మరో వీడియో వైరల్ అవుతోంది. దీనిని చూస్తే ఇద్దరి మధ్య ఉన్న అన్ని మనస్పర్థలు ఇప్పుడు పరిష్కారమైనట్లు అనిపిస్తోంది. ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియోలో బుమ్రా, కరుణ్ నాయర్ ఒకరినొకరు కౌగిలించుకుని మాట్లాడుకుంటున్నారు. వారిద్దరి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది వారిద్దరి మధ్య ఉన్న వివాదం ముగింపుకు సంకేతంగా అనిపిస్తోంది.

బుమ్రాను ప్రశంసించిన కరుణ్ నాయర్
మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కరుణ్ నాయర్ మాట్లాడుతూ.. బుమ్రా బౌలింగ్ లో అంత సులభంగా ఆడగలిగాడో వివరించాడు. పరుగులు సాధించడానికి సరైన బంతులను ఎంచుకోవడమే తనకు ఇష్టమని ఈ ఢిల్లీ బ్యాటర్ చెప్పాడు. బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అని కరుణ్ నాయర్ అభివర్ణించాడు. అయితే తాను కోరుకున్న దిశగా పరుగులు సాధించడానికి తనను తాను విశ్వసించుకుంటానని చెప్పాడు.