IPL 2025: ఐపీఎల్ 2025లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై సీఎస్కే మాజీ ఓపెనర్ అభినవ్ ముకుంద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీని వేలంలో కొనుగోలు చేయాల్సింది కాదని.. ఆ జట్టు యాజమాన్యం సూర్యవంశీతో పాటు నితీశ్ రాణాపై అనవసర పెట్టుబడి పెట్టిందని వ్యాఖ్యానించాడు. అదే తానైతే వైభవ్ సూర్యవంశీని రూ.1.1 కోట్లకు, నితీశ్ రాణాను రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసేవాడిని కాదని వెల్లడించాడు.
వైభవ్ సూర్యవంశీ, నితీశ్ రాణాపై పెట్టిన పెట్టుబడిని మంచి బౌలర్ల కోసం ఉపయోగించుకోవాల్సి ఉండేదని అభినవ్ ముకుంద్ అభిప్రాయపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం బ్యాటర్ల మోజులో పడి బౌలింగ్ విభాగాన్ని పూర్తిగా వదలేసిందని తెలిపాడు. బౌలింగ్ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో జోఫ్రా ఆర్చర్ ఒక్కడే తీసుకున్న జీతానికి న్యాయం చేశాడని అభినవ్ ముకుంద్ అన్నాడు. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఎంపిక చేసుకున్న భారత్కు చెందిన బౌలర్లలో ఒక్కరు కూడా సత్తా చాటలేకపోయారని పేర్కొన్నాడు. తుషార్ దేశ్పాండేపై రూ.6.75 కోట్ల పెట్టుబడి పెట్టి అనవసరంగా డబ్బును వృథా చేసుకున్నారని తెలిపాడు.

గత సీజన్లో తమ జట్టులో భాగంగా ఉన్న మంచి ప్లేయర్లను వదిలేసుకుని తప్పు చేసిందని అన్నాడు. గతంలో తమ జట్టులో భాగంగా ఉన్న ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, అవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ను వదిలేసి రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం మూల్యం చెల్లించుకుందని పేర్కొన్నాడు. మొత్తంగా ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎంపికలను అభినవ్ ముకుంద్ తప్పుబట్టాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లను వదిలేసి పెద్ద తప్పు చేసింది. ఈ సీజన్లో బ్యాటింగ్లో జోస్ బట్లర్, బౌలింగ్లో యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ అద్భుతాలు చేస్తున్నారు. వీరిని కాదని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం యువ ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టి పెద్ద తప్పు చేసింది.