IPL 2025: గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2025 నుంచి వైదొలిగి స్వదేశం దక్షిణాఫ్రికాకు పయనమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత విషయాన్ని పరిష్కరించుకోవడానికి కగిసో రబాడ వెళ్లారని ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో తెలిపింది. రబాడ ఎంతకాలం టోర్నీకి గైర్హాజరు అవుతాడో స్పష్టత లేదు. రబాడ తిరిగి వచ్చే తేదీని ఫ్రాంచైజీ వెల్లడించలేదు. రబాడ గుజరాత్ తరపున మొదటి రెండు మ్యాచ్ లు ఆడాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో రబాడ 41 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 42 పరుగులకు ఒక వికెట్ పడగొట్టాడు.
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్లతో గెలిచి గుజరాత్ మంచి జోరుమీద ఉంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రబాడ పరిలోకి దిగలేదు. రబాడ స్థానంలో అర్షద్ ఖాన్ ఆడాడు. టాస్ సమయంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. వ్యక్తిగత కారణాల వల్ల రబాడ ఆడటం లేదని చెప్పాడు. రబాడ స్థానంలో ఆల్రౌండర్ అర్షద్ ఖాన్ ను జట్టులోకి తీసుకున్నారు. అర్షద్ విరాట్ కోహ్లీని ఔట్ చేశాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో మాత్రమే వచ్చింది.

రబాడ తిరిగి వస్తాడా?
కగిసో రబాడ ఎప్పుడు తిరిగి వస్తాడనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. గుజరాత్ జట్టు రబాడ కీలక ఫాస్ట్ బౌలర్.. అతను లేకపోవడం ఆ జట్టుకే పెద్ద దెబ్బే. ఆ జట్టులో దక్షిణాఫ్రికాకు చెందిన జెరాల్డ్ కోయెట్జి ఉన్నాడు. కానీ అతనికి అవకాశం లభిస్తుందో లేదో చూడాలి. గుజరాత్ జట్టు తన తొలి మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఓడిపోయింది. కానీ ముంబై ఇండియన్స్, ఆర్సీబీలను ఓడించిన తర్వాత ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. గుజరాత్ జట్టులో ఇద్దరు కీలక ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ ఉన్నారు. ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. వీరితో పాటు ఇషాంత్ శర్మ, గుర్నూర్ బ్రార్, కుల్వంత్ ఖేజ్రోలియా కూడా జట్టులో ఉన్నారు. గుజరాత్ తన తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 6న సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది.