IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్లో పరాజయం పాలైతే ఆ బాధ ఎలా ఉంటుందో స్టార్ క్రికెటర్లకు బాగా తెలుసు. ఎందుకంటే టోర్నమెంట్ మొత్తం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినా ఫైనల్ మ్యాచ్లో దురదృష్టవశాత్తు తమ జట్టు ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతారు. ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ జట్టుపై 6 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ కలను సాకారం చేసుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ జట్టు రన్నరప్గా నిలిచింది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. వారిలో 3 వేర్వేరు జట్ట తరఫున 3 ఐపీఎల్ ఫైనల్స్ ఆడి ఓడిపోయిన ఏకైక ఆటగాడు కూడా ఉన్నాడు. అతడెవరో కాదు ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్.
యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున 7 సీజన్ల పాటు ఆడాడు. ఈ క్రమంలో 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్కు వచ్చింది. ఆ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఓటమిపాలైంది. ఆ తర్వాత యుజ్వేంద్ర చాహల్ ఆర్సీబీ నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లాడు. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టుపై చిత్తుగా ఓడిపోయింది. తాజాగా పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున యుజ్వేంద్ర చాహల్ ఫైనల్స్లో ఆడాడు. ఆర్సీబీపై ఈ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ ఓటమిపాలైంది. మూడు సార్లు యుజ్వేంద్ర చాహల్ తన జట్టుకు అత్యుత్తమ బౌలర్గా రాణించినా టైటిల్ అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో చాహల్ గురించి ఐరన్ లెగ్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఫైనల్ మ్యాచ్ పరిస్థితి ఇలా..
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ ఫైనల్లో ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తొలుత ఆర్సీబీ బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ 3 ఫోర్ల సాయంతో అత్యధికంగా 43 పరుగులు చేశాడు. పంజాబ్ తరఫున కైల్ జేమిసన్, అర్ష్దీప్ సింగ్ తలో 3 వికెట్లు పడగొట్టారు. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. 6 పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోయింది. పంజాబ్ తరఫున శశాంక్ సింగ్ అత్యధికంగా 61 పరుగులు చేశాడు. ఆర్సీబీ తరఫున భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా తలో 2 వికెట్లు పడగొట్టారు.