IPL 2025 Mumbai Indians: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ ఏకంగా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ లో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి.. ప్లే ఆఫ్స్ కు మరింత దగ్గరైంది. అయితే మ్యాచ్ విజయం తర్వాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య.. కోహ్లీ అన్న మాటలు గుర్తు చేశాడు! తమ జట్టు మళ్లీ వెనక్కి వెళ్లి బేసిక్ అండ్ సింపుల్ క్రికెట్ ఆడుతోందని, అందుకే విజయం సాధిస్తోందని చెప్పుకొచ్చాడు.
"బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. బౌలింగ్లోనూ క్లినికల్గా ఆడారు. మేము ఇంకో 15 పరుగులు చేస్తే బాగుండేది. కొద్దిలో మిస్ అయ్యాం. నేను సూర్య పక్కాగా పర్సంటేజ్ షాట్లు, క్రికెట్ షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నాం. గ్యాప్లలో బంతిని కొడితేనే షాట్లకి అసలైన విలువ ఉంటుంది. రోహిత్, రియాన్ అదే విధంగా ఆడారు. రియాన్ దూకుడుగా ఆడుతూ బౌండరీలపై దృష్టి పెట్టాడు. అద్భుతంగా ఆడాడు. ఇక్కడ ఎవరికి ఛాన్స్ వస్తుందనేది విషయం కాదు. పరిస్థితిని బట్టి ఏం అవసరమో దాన్ని ఆడటమే ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు మా ఆటగాళ్లు బ్యాట్స్మెన్షిప్కి తిరిగి వస్తున్నారు. భాగస్వామ్యాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. గ్యాప్లు చూసి ఆడటం, పరుగుల కోసం గట్టిగా ప్రయత్నించడం, ఇప్పుడు మేం బ్యాటింగ్ ఆడిన విధానం.. ఇవే అసలైన బ్యాట్స్మెన్షిప్. మా టీమ్ అంతా ఇలానే ఆడుతోంది." అని హార్దిక్ అన్నాడు.

కోహ్లీ ఏం చెప్పాడంటే..
కోహ్లీ కూడా ఇటీవలే టీ20 అంటే దంచికొట్టడమే కాదని చెప్పాడు. "మ్యాచ్ను నిలకడగా ముందుకు తీసుకెళ్లేందుకు సింగిల్స్, డబుల్స్ను కూడా వదిలను. ఈ మధ్య ప్లేయర్స్ భాగస్వామ్యం ప్రాముఖ్యతను మర్చిపోతున్నారు. బలమైన పార్ట్నర్షిప్ ఉంటేనే.. బౌలర్లపై ఆధిపత్యం చెలాయించగలం." అని కోహ్లీ చెప్పాడు. ఇప్పుడు హార్దిక్ కూడా అదే చెప్పాడు.
అందరూ అద్భుతమే..
"మా బౌలింగ్ లో ప్రత్యేకంగా ఎవరి గురించి చెప్పాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే అందరూ అద్భుతం. ఎంతో అనుభవంతో ఆడుతున్నారు. ప్రతి ఒక్కరూ చాలా క్లియర్గా ఉన్నారు. మేము మళ్ళీ సింపుల్ క్రికెట్కి వస్తున్నాం. అదే మాకు పని చేస్తోంది. ఇది ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాం. మేము వినయంగా, క్రమశిక్షణతో ఉంటూ, క్రికెట్ పై మాత్రమే ఫోకస్ పెడతాం. ఆటను గౌరవిస్తాం." అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.