IPL 2025: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ ప్రయాణం ముగిసింది. ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో గుజరాత్ టైటాన్స్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ గత రెండు లీగ్ మ్యాచ్లలో ఓటమి కారణంగా వారు ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్క ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు ముంబై జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది.
కన్నీళ్లు పెట్టుకున్న ఆశిష్ నెహ్రా కొడుకు, కూతురు
శుక్రవారం ముంబైతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 20 పరుగులు తేడాతో పరాజయం కావడంతో ఆ జట్టు ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది. గుజరాత్ ఓటమి తర్వాత ఆ జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా కూతురు, కొడుకు బోరున విలపించారు. శుభ్మన్ గిల్ సోదరి కూడా గుజరాత్కు మద్దతుగా నిలిచింది. ఈ సమయంలో షహ్నీల్ గిల్ కూడా ఆశిష్ నెహ్రా కూతురిని శాంతింపిజేస్తూ కనిపించింది. అయితే ఆ సమయంలో ఆమె కూడా భోవోద్వేగానికి లోనైంది.

అద్భుతంగా ఆడిన ముంబై
ఈ కీలక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో కలిసి 7.1 ఓవర్లలో 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత బెయిర్స్టో 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ రోహిత్ శర్మ 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. రోహిత్ కీలక ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ఈ క్రమంలో గుజరాత్ ఆటగాళ్లు కాస్తా ఆందోళనకు గురయ్యారు.
ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన సాయి సుదర్శన్ 49 బంతుల్లో 80 పరుగులు చేసినప్పటికీ గుజరాత్ జట్టు 6 వికెట్ల నష్టానకి 208 పరుగులు మాత్రమే చేసి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. గుజరాత్ 16వ ఓవర్ వరకు మ్యాచ్ను తన నియంత్రణలోనే ఉంచుకుంది. కానీ సాయి సుదర్శన్ వికెట్ తర్వాత ముంబై పట్టు బిగించింది. జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన యార్కర్ వేసి వాషింగ్టన్ సుందర్ ను ఔట్ చేశాడు. అనంతరం రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్లో స్కూప్ షాట్ ఆడటానికి ప్రయత్నిస్తూ సాయి సుదర్శన్ పెవిలియన్ చేరాడు. చివరి రెండు ఓవర్లలో గుజరాత్ జట్టుకు 36 పరుగులు అవసరం. ఆ సమయంలో ఇద్దరు అద్భుతమైన బ్యాటర్లు రాహుల్ తెవాటియా, షెర్పేన్ రూథర్ఫోర్డ్ క్రీజులో ఉన్నారు. చివరి ఓవర్లో 24 పరుగులు అవసరం కాగా.. ఈ మ్యాచ్ ద్వారా ముంబై తరఫున అరంగేట్రం చేసిన రిచర్డ్ గ్లీసన్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
గుజరాత్ చెత్త ఫీల్డింగ్
దీనికి ముందు గుజరాత్ ఫీల్డింగ్ కూడా చాలా చెత్తగా ఉంది. గుజరాత్ జట్టు మూడు ముఖ్యమైన క్యాచ్లను జారవిడిచి ఈ కీలక మ్యాచ్ ను చేజేతులా వదిలేసింది. వాటిలో రెండు రోహిత్ శర్మ క్యాచ్లు కాగా.. ఒకటి సూర్యకుమార్ యాదవ్ క్యాచ్. పవర్ ప్లేలో రోహిత్ శర్మ రెండు లైఫ్లను పొందాడు. రోహిత్ దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. మొదట జెరాల్డ్ కోయెట్జీ రోహిత్ క్యాచ్ను డీప్లో వదిలిపెట్టాడు. తర్వాత గుజరాత్ తరఫున అరంగేట్రం చేసిన కుశాల్ మెండిస్ వికెట్ల వెనుక క్యాచ్ను వదిలివేశాడు.