ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఎలాంటి నాటకీయతకు అవకాశం ఇవ్వకుండా ఆడింది. బట్లర్ అద్భుత ఇన్నింగ్స్, సాయి సుదర్శన్ చక్కని బ్యాటింగ్ చేయడంతో గుజరాత్ లక్ష్యాన్ని ఛేదించగలిగింది.
కానీ సుదర్శన్తో కలిసి ఛేదనను ప్రారంభించిన గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (14) త్వరగానే పెవిలియన్ చేరాడు. అయితే మ్యాచ్ అనంతరం తమ విజయానికి గల కారణాన్ని తెలిపాడు గిల్. ఆర్సీబీని కట్టడి చేయడానికి తమ జట్టు రచించిన వ్యూహాన్ని తెలిపాడు.

"ఈ గ్రౌండ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను 170 పరుగుల్లోపే కట్టడి చేయడం ఆనందంగా ఉంది. పిచ్ ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తుంటుంది. త్వరగా వికెట్లు పడగొడితే 250+ స్కోరును కూడా చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. తొలి 7-8 ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లకు మంచి ఆరంభం లభించింది. త్వరగా ఆర్సీబీ వికెట్లు పడగొడితేనే మ్యాచ్ను మా వైపు ఉండేందుకు అవకాశం దొరుకుతుందని ముందుగానే భావించాం. అందుకు తగ్గట్టే మా బౌలర్లు రాణించారు. ఒకవేళ అలా జరగకపోయినా, వచ్చే అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకోవాలి. పిచ్ ఆధారంగా మా బ్యాటింగ్లో మార్పులు చేసుకుని బరిలోకి దిగాం. పరిస్థితులను అర్థం చేసుకుని, అందుకు తగట్టు ఆడాం" అని గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు.