ఐపీఎల్ మెగా వేలానికి అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. నలుగురు నుంచి అయిదుగురు కంటే ఎక్కువ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అవకాశం లేదని సమాచారం అందడంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. పునాదులతో సహా నూతన జట్టును నిర్మించాలని కొన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్కు గుడ్బై చెబుతున్నారు.
ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచ్ రికీ పాంటింగ్తో ఒప్పందానికి ముగింపు పలికింది. త్వరలో కొత్త కోచ్ను ప్రకటిస్తామని తెలిపింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా కోచింగ్ సిబ్బందిని మార్చాలని నిర్ణయించుకుంది. అయితే ఈ నేపథ్యంలో గెల్ మాక్స్వెల్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మాక్సీ-ఆర్సీబీ బంధం ముగిసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాలో ఆర్సీబీని మాక్స్వెల్ అన్ఫాలో కొట్టడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.

విధ్వంసకర బ్యాటర్ మాక్స్వెల్ను ఆర్సీబీ 2021 వేలంలో రూ.14.25 కోట్లకు దక్కించుకుంది. ఆ తర్వాత ఏడాది జరిగిన మెగా వేలానికి ముందు రూ.11 కోట్ల ఒప్పందంతో రిటైన్డ్ చేసుకుంది. 2021 సీజన్లో 513 పరుగులతో సత్తాచాటిన మాక్సీ ఆ తర్వాత 301, 400 పరుగులతో అంచనాలను అందుకోలేకపోయాడు. ఇక 2024 సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 10 మ్యాచ్ల్లో కేవలం 52 పరుగులే చేశాడు.
ఈ నేపథ్యంలో మాక్స్వెల్పై వేటు వేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మాక్సీ స్థానంలో యువ ఆల్రౌండర్ విల్ జాక్స్ను జట్టులో కొనసాగించాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ భావిస్తుందని రాసుకొచ్చింది. కాగా, ఇటీవల జరిగిన మేజర్ క్రికెట్ లీగ్-2024లో మాక్సీ ఫామ్లోకి వచ్చాడు. వాషింగ్టన్ ఫ్రీడమ్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే మాక్సీ సోషల్ మీడియాలో అంతకుముందు ఆర్సీబీని ఫాలో అవుతాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. కానీ ఇన్స్టాలో అన్ఫాలో చేశాడని ప్రచారం సాగుతోంది. మరోవైపు కేఎల్ రాహుల్ ఆర్సీబీలోకి వస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.