రిటైన్ లిస్ట్ను సమర్పించడానికి మరో రెండు వారాలు మాత్రమే గడువు ఉన్న ఈ పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కోచింగ్ సిబ్బంది నియామకంపై దృష్టిసారించింది. ప్రధాన కోచ్ బాధ్యతలను హేమాంగ్ బదానికి అప్పగించడానికి సిద్ధమైంది. అంతేగాక డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవిని వేణుగోపాల్ రావుకు అందివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్కు ఏడేళ్లుగా ప్రధాన కోచ్ బాధ్యతలు నిర్వర్తించిన ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ను ఇటీవల తప్పించిన విషయం తెలిసిందే. కోచ్గా పాంటింగ్ హయాంలో ఢిల్లీ జట్టు 2019, 2020, 2021 సీజన్లలో ప్లేఆఫ్స్కు చేరుకుంది. అంతేగాక ఆ జట్టు తొలిసారి ఫైనల్స్కు చేరింది. 2020లో టైటిల్ పోరుకు వెళ్లిన ఢిల్లీ రన్నరప్గా నిలిచింది. కానీ గత మూడు సీజన్లలో ఢిల్లీ అంచనాలు అందుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్ను కోచ్ పదవి నుంచి తప్పించింది. ఢిల్లీ వదులుకోవడంతో రికీ పాంటింగ్ను పంజాబ్ కింగ్స్ తమ ప్రధాన కోచ్గా నియమించుకుంది. మరోవైపు పాంటింగ్ను తప్పించిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోచ్గా బాధ్యతలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అయితే తాజాగా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి నుంచి గంగూలీని కూడా ఢిల్లీ ఫ్రాంచైజీ తప్పించిందని సమాచారం.
ఆ స్థానాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావుకు అందివ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే గంగూలీతో ఢిల్లీ పూర్తిగా తమ బంధాన్ని తెంచుకుందా లేదా దాదాకు మరో బాధ్యతలు అందివ్వనుందా అనే విషయంపై స్పష్టత లేదు. కానీ ప్రస్తుతానికి డైరక్టర్ ఆఫ్ క్రికెటర్ పదవి నుంచి మాత్రం గంగూలీని తప్పించినట్లు తెలుస్తోంది. కాగా, చెన్నై లీగ్లో హేమాంగ్ బదాని, వేణుగోపాల్ రావు కలిసి పనిచేశారు. అంతేగాక వీరిద్దరు ఢిల్లీ క్యాపిటల్స్ అనుబంధ ఫ్రాంచైజీల తరఫున ఇంటర్నేషనల్ లీగ్ టీ20, మేజర్ క్రికెట్ లీగుల్లో బాధ్యతలు నిర్వర్తించారు.
అయితే హేమాంగ్, వేణుగోపాల్కు తమ ఇతర కోచింగ్ సిబ్బందిని నియమించుకోవడంలో ఫ్రాంచైజీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని సమాచారం. కాగా, భారత్ తరఫున వేణుగోపాల్ 16 వన్డేలు, బదానీ నాలుగు టెస్టులు, 40 వన్డేలు ఆడాడు.