Chennai Super Kings: ఐపీఎల్ 2025లో తాజా ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న వేళ.. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ పై నాలుగు వికెట్ల తేడాతో ఓటమిని అందుకుంది సీఎస్కే. దీంతో ఇప్పటిదాకా సాంకేతికంగా మాత్రమే ప్లేఆఫ్స్ రేసులో ఉన్న చెన్నై జట్టు.. 10 మ్యాచ్ల్లో 8 ఓటములతో పోటీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అంటే ఇకపై మిగతా నాలుగు మ్యాచ్ల్లో ఆ జట్టు గెలిచినా ఎటువంటి ఉపయోగం ఉండదు.
చెన్నై అందుకున్న చెత్త రికార్డు ఇదే..
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి... ఒకే సీజన్లో సొంత మైదానంలో వరుసగా అత్యధిక ఓటములు అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్ లో చెపాక్ లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో సీఎస్కే ఐదు పరాజయాలు ఖాతాలో వేసుకుంది. అంతకుముందు 2008 (6 మ్యాచుల్లో), 2012లో (10 మ్యాచుల్లో, ఫైనల్స్ తో పాటు) వరుసగా నాలుగు మ్యాచులు ఓడింది. అలాగే పంజాబ్ పై వచ్చిన ఈ ఓటమితో ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా సీఎస్కే నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ప్లేఆఫ్స్ వెళ్లకుండా ఇంటిముఖం పట్టింది సీఎస్కే.
చెపాక్ లో సీఎస్కేపై అత్యధిక విజయాలు..
చెపాక్ లో సీఎస్కేపై ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఐదు ( 9 మ్యాచుల్లో) విజయాలను నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (5 విజయాలు, 9 మ్యాచులు), కేకేఆర్ (4 విజయాలు, 12 మ్యాచులు) ఉన్నాయి.
పంజాబ్ పై 8 ఆడితే 7...
2023 నుంచి ఇప్పటివరకు చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు తలపడగా.. అన్నింటిలో పంజాబ్ గెలిచింది. గత 8 మ్యాచుల్లోనూ (హోమ్ అండ్ అవే) ఏడింటిలో పంజాబ్ కింగ్సే విజయం సాధించింది.
