మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోవడం ఖాయమే. అయితే దాని కంటే ముందుగా కొన్ని ప్రాంఛైజీల్లో కోచింగ్ సిబ్బందిలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ను తప్పించింది. గుజరాత్ టైటాన్స్ కూడా హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకితో తమ ఒప్పందాన్ని ముగించుకుంటుంది.
అయితే అదే బాటలో పంజాబ్ కింగ్స్ కూడా చేరనుందని తెలుస్తోంది. తమ ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్ను తప్పించాలని చూస్తోంది. అతనికి బదులుగా భారతీయ కోచ్ను నియమించాలని చూస్తోంది. ట్రెవర్ బేలిస్ కోచింగ్లో పంజాబ్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగించింది. 2023 సీజన్లో పంజాబ్ ఎనిమిదో స్థానం, 2024 సీజన్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఈ నేపథ్యంలో ట్రెవర్ బేలిస్ను తప్పించి అతని స్థానంలో సంజయ్ బంగర్ను నియమించాలని పంజాబ్ యాజమాన్యం ఆలోచిస్తుంది. ప్రస్తుతం పంజాబ్కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ డెవలెప్మెంట్గా సంజయ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే కోచ్గా పనిచేసిన అతనికే మరోసారి కోచ్గా నియమించాలని పంజాబ్ భావిస్తోంది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన రికార్డు పంజాబ్ కింగ్స్ పేరిట ఉంది. ఇప్పటివరకు పంజాబ్ కేవలం రెండు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్కు చేరింది. గత పది సీజన్లుగా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతుంది. 2014లో రన్నరప్గా నిలవడమే పంజాబ్ అత్యుత్తమ ప్రదర్శన. మూడు సీజన్లలో పాయింట్ల పట్టికలో అట్టుడగున నిలిచింది. ఈ ఏడాది జరిగిన సీజన్లో తమ సారథి శిఖర్ ధావన్ దూరమవ్వడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది.
అయితే మెగావేలంతో తమ కప్ కలను సాకారం చేసే జట్టును సిద్ధం చేయాలని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం భావిస్తుంది. ఈ నేపథ్యంలో భారత యువ ఆటగాళ్లపై అవగాహన ఉండే ఇండియన్ కోచ్కు ప్రధాన బాధ్యతలు అప్పగించాలని భావిస్తుంది. దీంతో విదేశీ కోచ్పై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆస్ట్రేలియాకు చెందిన ట్రేవర్ బేలిస్ గతంలో కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్కు కూడా పనిచేశాడు.