Sunrisers Hyderabad Players Fire Accident: ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతోన్న వేళ.. సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లకు భారీ ప్రమాదం తృటిలో తప్పింది. SRH ప్లేయర్లు అగ్నిప్రమాదం నుంచి కాస్తలో తప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ అభిమానుల్లో ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే?
ఎక్కడ జరిగిందంటే?
హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగి పొగలు రావటంతో హోటల్ సిబ్బందితో పాటు అక్కడున్న గెస్టులు భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో ఆరో అంతస్తులో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ కూడా ఉన్నారు. వారు వెంటనే.. ప్రమాద స్థలం నుంచి తప్పించుకుని, బస్సులో వెళ్లిపోయారు.

ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే?
సమాచారం అందడంతో తక్షణమే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి మంటలను ఆపేందుకు ప్రయత్నించింది. జూబ్లీహిల్స్ నుంచి ఒక ఫైర్ ఇంజిన్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. మొదటి అంతస్తులో విద్యుత్ వైరింగ్లో సమస్య తలెత్తడం వల్లే పొగలు వచ్చాయని ప్రాథమికంగా తెలిసింది. ఈ అగ్ని ప్రమాదం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రదర్శన..
ఈ ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆశించినంత స్థాయిలో ఆడట్లేదు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచుల్లో రెండింటిలో మాత్రమే గెలిచింది. మొదటి మ్యాచుతో పాటు ఆరో మ్యాచులో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.