RCB vs PBKS IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు జరగనుంది. 2022 తర్వాత తొలిసారిగా ఐపీఎల్ కొత్త ఛాంపియన్ను పొందబోతున్నందున ఈ టైటిల్ మ్యాచ్ కోసం అందరూ ఉత్సాహంగా ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ రెండు జట్లు 18 ఏళ్లుగా తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం చూస్తున్నాయి. వాటిలో ఒక జట్టు కల నేడు నెరవేరబోతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల ప్రదర్శన ఈ సీజన్ మొత్తం అద్భుతంగా ఉంది. ఆర్సీబీ క్వాలిఫయర్-1లో పంజాబ్ జట్టును ఓడించి ఫైనల్కు చేరుకోగా.. పంజాబ్ కింగ్స్ రెండో క్వాలిఫయర్లో ముంబై ఇండియన్స్ను ఓడించి ఫైనల్ను చేరుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన ఫైనల్ జరగనుంది.

ఆర్సీబీ, పంజాబ్ హెడ్ టు హెడ్ రికార్డు
ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మొత్తం 36 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఆర్సీబీ 18 మ్యాచ్లు గెలవగా.. పంజాబ్ కింగ్స్ 18 మ్యాచ్లు గెలిచింది. రెండు జట్లు సమాన మ్యాచ్లను గెలుచుకున్నాయి. గణాంకాల ప్రకారం.. రెండు జట్ల మధ్య ఎల్లప్పుడూ తీవ్రమైన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జట్లలో ఫైనల్లో ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. ఏ జట్టు కూడా ఫేవరేట్ కాదు. అయితే రెండు జట్ల మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్లలో ఆర్సీబీ పైచేయి సాధించింది. ఆర్సీబీ 5 మ్యాచ్ల్లో 4 గెలిచింది.
పంజాబ్ 11.. ఆర్సీబీ 9 ఏళ్ల తర్వాత ఫైనల్
11 ఏళ్ల సుదీర్ఘం నిరీక్షణ తర్వాత పంజాబ్ కింగ్స్ మరోసారి ఐపీఎల్ ఫైనల్ చేరుకుంది. చివరిసారిగా 2014లో వారు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో ఫైనల్ ఆడారు. పంజాబ్ రెండో సారి మాత్రమే ఐపీఎల్ ఫైనల్ ఆడుతోంది. మరోవైపు ఆర్సీబీకి ఇది నాలుగో ఐపీఎల్ ఫైనల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 ఏళ్ల క్రితం 2016లో సన్రైజర్స్ హైదరాబాద్తో చివరి ఐపీఎల్ ఫైనల్ ఆడింది.
శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండో సారి ఐపీఎల్ గెలిచే అవకాశం
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్య్ర్ ఆటగాడిగా, కెప్టెన్గా వరుసగా రెండోసారి ఐపీఎల్ గెలిచే అవకాశం ఉంది. గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోకోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టుతో కలిసి ఈ ఘనతన సాధించే అవకాశం ఉంది.