ఐపీఎల్ 2025లో అటు మంచి ప్రదర్శన కారణంగా.. ఇటు కాంట్రవర్సీ పరంగా ఈ మధ్య బాగా వినిపిస్తోన్న పేరు దిగ్వేశ్ రాఠి. ముఖ్యంగా ఈ లక్నో ఆటగాడు వికెట్ తీయగానే చేసుకుంటున్న నోట్ బుక్ సెలబ్రేషన్స్ వివాదస్పదంగా మారుతోంది. దీంతో మ్యాచ్ నిర్వాహకులు కూడా అతడికి జరిమానా విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్లు ఇస్తున్నారు. కానీ అతడి తీరు మాత్రం మారట్లేదు. తాజాగా కూడా ముంబయితో జరిగిన మ్యాచులో మళ్లీ అదే తంతు కొనసాగించి ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో మళ్లీ అతడికి ఈ సారి రెట్టింపు జరిమానా విధించడంతో పాటు ఎక్కువ డీమెరిట్ పాయింట్లు ఇచ్చారు.
రూ.50 లక్షల జరిమానా నిజమేనా?
ఈ విషయం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దిగ్వేశ్.. ఈ డబుల్ ఫైన్ తో మొత్తంగా రూ.50 లక్షలు చెల్లించబోతున్నాడని కొన్ని కథనాలు కనిపిస్తున్నాయి. అలాగే అతడు తాను అందుకోనున్న ఐపీఎల్ జీతం కన్నా ఎక్కువగా జరిమానానే కట్టబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి అందులో నిజమెంత?, అసలు అతడి మ్యాచు ఫీజు ఎంత?, అతడు ఎంత జరిమానాగా కట్టాలి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు ఎంత కట్టాలంటే?
ముందుగా దిగ్వేశ్ రూ.50 లక్షలు ఫైన్ చెల్లించాలంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది! ఎందుకంటే అతడిని లక్నో.. మెగా వేలంలో రూ.30 లక్షలకే కొనుగోలు చేసింది. పైగా ఐపీఎల్ 2025లో ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్తో పాటు ప్రతి ప్లేయర్ కు రూ.7.5 లక్షల మ్యాచు ఫీజ్ ఇస్తారు. అంటే దిగ్వేశ్ కు ఈ రూ.7.5 లక్షల మ్యాచు ఫీజులోనే కోత విధిస్తారన్నమాట. ఈ లెక్కన చూస్తే తొలి మ్యాచు ఫీజులో అతడికి 25శాతం ఫైన్ విధించారు. అంటే అతడు రూ.1,87,500 కట్టాలి. ఇక రెండో మ్యాచులో 50 శాతం జరిమానా విధించారు. అంటే ఇందులో అతడు రూ.3,75,000 కట్టాలి. మొత్తంగా రూ.5,62,500 చెల్లిస్తే సరిపోతుంది. ఇంకా ఈ జరిమనాతో పాటు అతడి ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు వచ్చి చేరాయి.