IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్ జోరుగా కొనసాగుతోంది. ఏప్రిల్ 7న జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ను ఓడించింది. ఐపీఎల్ 2025లో భాగంగా నేడు(మంగళవారం) రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ రోజంతా క్రికెట్ అభిమానులకు పండగే పండగ. మొదటి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగనుంది. రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఐపీఎల్లో డబుల్ హెడర్ మ్యాచ్లు తరచుగా శని, ఆదివారాల్లో జరుగుతాయి. కానీ ఐపీఎల్ 2025లో మంగళవారం రోజున రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి. మంగళవారం నాడు రెండు మ్యాచ్ లు జరగడానికి కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
మంగళవారం రెండు మ్యాచ్లు.. ఎందుకు?
ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8న ఒకే ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఏప్రిల్ 8న రెండు మ్యాచ్లు జరుగుతాయి. ఎందుకంటే ఈ సీజన్ షెడ్యూల్ స్వల్పమార్పులు జరిగాయి. కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ డేట్ మారింది. షెడ్యూల్ ప్రకారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఏప్రిల్ 6, ఆదివారం రోజున ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సి ఉంది. కానీ అదే రోజున శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నందున అటు శ్రీరాముడి శోభాయాత్రకు, ఇటు మ్యాచ్ కు తగిన భద్రతను కల్పించలేమని పోలీసులు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కు లేఖ రాశారు. దయచేసి మ్యాచ్ తేదీని మార్చాలని పోలీసులు లేఖలో కోరగా.. ఆ రోజు జరగాల్సిన మ్యాచ్ ను మంగళవారానికి(ఏప్రిల్ 8) వాయిదా వేశారు. కాబట్టి ఏప్రిల్ 8న రెండు మ్యాచ్ లు జరగనున్నాయి.

గెలవడంపై దృష్టి సారించిన జట్లు
కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు విజయంపై దృష్టి సారిస్తున్నాయి. ఇరుజట్లు ఇప్పటివరకు తలో నాలుగు మ్యాచ్ లు ఆడాయి. ఈ మ్యాచ్ లలో కోల్కతా నైట్ రైడర్స్ రెండు మ్యాచ్ లలో విజయం సాధించగా.. లక్నో సూపర్ జెయింట్స్ కూడా రెండు మ్యాచ్ లలో గెలిచింది. పాయింట్ల పట్టికలో కేకేఆర్ ఐదో స్థానంలో ఉండగా.. లక్నో జట్టు ఆరో స్థానంలో ఉంది. రెండు జట్లు తమ మూడో విజయం కోసం చూస్తున్నాయి. కేకేఆర్ జట్టులో అజింక్య రహానే, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డికాక్ వంటి గొప్ప ఆటగాళ్లు ఉండగా.. లక్నో జట్టులో కూడా చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు.