IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 12 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. దీంతో ఈ టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన లక్నో జట్టు రెండు విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు నాలుగు మ్యాచ్ లు ఆడిన ముంబై జట్టు 3 మ్యాచ్లలో ఓటమిని చవిచూసింది.
రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం
ఇదిలా ఉండగా.. రోహిత్ శర్మ లక్నోతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడలేదు. దీంతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను పక్కన పెట్టారని, సీనియర్ ఆటగాడి పట్ల మేనేజ్మెంట్ నిర్ణయం సరైనది కాదంటూ సోషల్ మీడియాలో రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్లో పరుగులు రాబట్టేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో రోహిత్ శర్మ 0,8, 13 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ రోహిత్ శర్మ శుక్రవారం లక్నోతో జరిగిన మ్యాచ్ లో కనిపించకపోవడంతో పక్కన పెట్టేశారా అనే చర్చ మొదలైంది. లక్నో మ్యాచ్ లో రోహిత్ ఆడడం లేదనే వార్త విని రోహిత్ ఫ్యాన్స్ కు నిరాశ తెప్పించింది.

రోహిత్ కు గాయం
కానీ రోహిత్ శర్మ లక్నోతో జరిగిన మ్యాచ్లో ఆడకపోవడానికి ఓ ప్రధాన కారణం ఉందని తెలిసింది. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ మోకాలికి బంతి తగలడంతో గాయమైందని తెలిసింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మకు తుది జట్టులో అవకాశం దక్కలేదని జట్టు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టాస్ సందర్భంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. గాయం కారణంగా రోహిత్ శర్మ మ్యాచ్ ఆడటం లేదని చెప్పాడు. మరో వైపు మ్యాచ్ ప్రారంభానికి ముందు వైరల్ అయిన వీడియోలో రోహిత్ శర్మకు ప్రాక్టీస్ సమయంలో మోకాలిపై బంతి తగిలినట్లు కనిపించింది. ఆ తర్వాత హిచ్ మ్యాన్ బ్యాట్ సపోర్టుతో మెట్లు ఎక్కుతూ కనిపించాడు.
కోచ్ ఏమన్నాడంటే?
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గాయం గురించి ముంబై హెడ్ కోచ్ మహేల జయవర్ధనే కూడా మాట్లాడారు. రోహిత్ మోకాలి దగ్గర గాయమైందని.. బ్యాటింగ్ కు ప్రయత్నించినప్పటికీ ప్రాక్టీస్ లో పాల్గొనలేకపోయాడని చెప్పాడు. ఫిట్నెస్ టెస్ట్ లో కూడా రోహిత్ అసౌకర్యంగా కనిపించాడని.. ఈ క్రమంలో కొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ గాయం నిజమని తేలింది.
రానున్న మ్యాచ్లు ఆడతాడా?
వరుస మ్యాచ్లలో రోహిత్ శర్మ వైఫల్యాల కారణంగా మూడో మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకువచ్చారని.. నాలుగో మ్యాచ్ లో హిట్ మ్యాన్ ను తప్పించారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కెప్టెన్, కోచ్ గాయం కారణంగా రోహిత్ మ్యాచ్ కు దూరమైనట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. లక్నోతో మ్యాచ్ జరిగిన సమయంలో రోహిత్ గ్రౌండ్ లోనే ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ తో మాట్లాడుతూ కనిపించాడు. ఇవన్నీ చూస్తే రోహిత్ గాయం కారణంగానే ఆడలేదని తెలుస్తోంది. అయితే రానున్న మ్యాచ్లలో రోహిత్ ఆడతాడా అనేది తెలియరాలేదు. కోచ్ మాత్రం కొన్ని రోజులు రోహిత్ కు విశ్రాంతి అవసరమని చెప్పారు. ఈ క్రమంలో రోహిత్ గాయం తీవ్రమైనది కాకపోయినా ఏప్రిల్ 7న ఆర్సీబీతో జరిగే మ్యాచ్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది.