IPL 2025: ఎంఎస్ ధోని రిటైర్డ్ అవ్వాల్సిన సమయం వచ్చిందంటూ సీఎస్కే మాజీ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025లో సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కామెంటరీ బాక్స్ లో ఉన్న మాథ్యూ హేడెన్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ధోని ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించాలని లేకుంటే సీఎస్కేకు ప్రమాదం అంటూ సూచనలు చేశాడు. ఎంఎస్ ధోని పేలవమైన ఫామ్ గురించి హేడెన్ మాట్లాడుతూ.. ఈ సీజన్ లో ధోని తన జట్టుకు మ్యాచ్ లను పూర్తి చేయడంలో విఫలమయ్యాడని అన్నాడు. ధోని క్రికెట్ కెరీర్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుందని భావించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోని 26 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్తో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నెమ్మదిగా బ్యాటింగ్ చేసినందుకు హేడెన్ ఎంఎస్ ధోనిని విమర్శించాడు. రన్ రేట్ వేగంగా పెరుగుతున్నప్పటికీ ఎంఎస్ ధోని, విజయ్ శంకర్ వేగంగా స్కోరు చేయలేకపోయారని చెప్పాడు. ధోని ఇప్పుడు క్రికెట్ వదిలి కామెంటరీ బాక్స్ వద్దకు వచ్చి అతనితో కూర్చోవాలని మాథ్యూ హేడెన్ సెటైర్ విసిరాడు. ఇప్పటికే లేట్ అయిందని, త్వరగా వచ్చేయ్ అంటూ హేడెన్ మాట్లాడాడు. రాజస్థాన్ రాయల్స్పై మ్యాచ్ తర్వాత కూడా ఎంఎస్ ధోనిపై ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.

మాథ్యూ హేడెన్ ఇలా అన్నాడు..
"ఈ మ్యాచ్ తర్వాత ఎంఎస్ ధోని మన కామెంటరీ బాక్స్కి రావాలి. ఇప్పుడు ఎంఎస్ ధోని తన క్రికెట్ టచ్ కోల్పోయాడు. ధోని క్రికెట్ కెరీర్ ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా ఆలస్యం చేయకముందే ధోనినే దీన్ని అంగీకరించాలి" అని మాథ్యూ హేడెన్ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఎంఎస్ ధోని ప్రదర్శన ఇలా..
ఈ సీజన్ లో ఎంఎస్ ధోని ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. ఎంఎస్ ధోని ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ల్లో 138.18 స్ట్రైక్ రేట్ తో మొత్తం 76 పరుగులు చేశాడు. ధోని అత్యత్తమ స్కోరు 30 పరుగులు.. కానీ ఆ స్కోరును 16 బంతుల్లో చేశాడు. ఈ సీజన్లో సీఎస్కే ముంబై ఇండియన్స్ పై ఏకైక విజయాన్ని సాధించింది. ఆ మ్యాచ్ లో ధోని కేవలం రెండు బంతులు మాత్రమే ఆడి ఏమి పరుగులు చేయకుండానే నాటౌట్ గా నిలిచాడు. ఆర్సీబీపై ధోని 30 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత జట్టుకు చివరి 28 బంతుల్లో 98 పరుగులు అవసరం. అది చాలా కష్టం.
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 25 బంతుల్లో 54 పరుగులు అవసరం అయినప్పుడు ధోని క్రీజులోకి వచ్చాడు. 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో జట్టుకు 56 బంతుల్లో 110 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో ధోని బ్యాటింగ్ కు వచ్చాడు. ఆ సమయంలో ధోని, విజయ్ శంకర్ క్రీజులో ఉన్నారు. కానీ వారిద్దరూ త్వరగా పరుగులు సాధించడానికి ప్రయత్నించలేదు. ఈ మ్యాచ్ లో ధోని 26 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. విజయ్ శంకర్, ధోని చివరివరకు క్రీజులోనే ఉన్నారు.. కానీ సీఎస్కేకు ఓటమి తప్పలేదు.