రిటైన్ ప్లేయర్ల లిస్ట్ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. గురువారం లోపు తమ రిటెన్షన్ లిస్ట్ను సమర్పించాల్సి ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్. ఆరుగురిని రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్టీఎమ్ కార్డ్తో వేలంలో సొంతం చేసుకోవచ్చు.
నేరుగా రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్క్యాప్డ్ ప్లేయర్ను అట్టిపెట్టుకుంటే మాత్రం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలు అన్ని దాదాపుగా తమ రిటైన్ లిస్ట్ను ఖరారు చేశాయి.

కొన్ని ఫ్రాంచైజీలు అనూహ్యంగా తమ కెప్టెన్లను వదులుకుంటున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్ వేలంలోకి రానున్నారు. ఈ జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా చేరాడు. అయితే శ్రేయస్, రాహుల్లను వదులుకోవడానికి ఆయా ఫ్రాంచైజీలకు ఉన్న కారణాలతో పోలిస్తే, పంత్ను విడిచిపెట్టడానికి ఢిల్లీ క్యాపిటల్స్కు భిన్నమైన కారణాలు ఉన్నాయి.
మేనేజ్మెంట్తో పలు అంశాల్లో పంత్ పదేపదే విభేదించడం ప్రధాన కారణం. ఢిల్లీ క్యాపిటల్స్కు జీఎమ్ఆర్, జిందాల్ సంస్థలు సంయుక్త యజమానులుగా కొనసాగుతున్నాయి. రెండేళ్లకు ఒకసారి ఈ రెండు సంస్థలు ఢిల్లీ జట్టు నిర్వహణ బాధ్యతలు బదిలీ చేసుకుంటున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే రెండు సీజన్ల పాటు జీఎంఆర్ గ్రూప్ నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. అయితే జీఎంఆర్ ప్రతినిధులతో పంత్కు తరచూ విభేదాలు వస్తున్నాయి.
మరో కారణం కోచ్ ఎంపిక. కోచ్ ఎంపిక విషయంలో పంత్ పట్టుబట్టాడని తెలుస్తోంది. ప్రధాన కోచ్తో పాటు సహాయక సిబ్బంది విషయంలోనూ పంత్ ఢిల్లీ యాజమాన్యం ముందు కొన్ని డిమాండ్లు ఉంచాడు. దీని గురించి గత నెలలో నిరంతంగా చర్చలు కూడా కొనసాగాయి. పంత్ డిమాండ్ను ఢిల్లీ మేనేజ్మెంట్ అంగీకరించలేదు. అంతేగాక విభేదాలు ముదురుతుండటంతో పంత్ను వదులుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైంది. కాగా, పంత్ మెగా వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.