ఫార్మాట్ ఏదైనా, వేదిక ఎక్కడైనా .. ఐపీఎల్ 2025 దిల్లీ క్యాపిటల్స్ కు చెందిన ఓ క్రికెటర్ ప్రస్తుతం బ్యాట్ ఝుళిపిస్తున్నాడు. తనదైన శైలిలో బ్యాట్ తో బంతిని బాదుతూ తుపాను సృష్టిస్తున్నాడు. గత 37 రోజుల్లో మూడు డబుల్ సెంచరీలు బాది సంచలనం క్రియేట్ చేశాడు. అయితే తాజాగా మరోసారి అదే పనిగా ఫోర్లు, సిక్స్ లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఏకంగా 20 సిక్సర్లు, 21 ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. ఇంతకీ అతడెవరంటే.
తాజాగా అండర్ 23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా గుజరాత్ - మధ్య ప్రదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లోనే రైట్ హ్యాండ్ బ్యాటర్ సమీర్ రిజ్వీ తన దూకుడు ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 164.78 స్ట్రైక్ రేట్తో 159 బంతుల్లో 20 సిక్సర్లు, 21 ఫోర్లతో డబుల్ సెంచరీ సాధించాడు. 262 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్లో.. తన సహ బ్యాటర్ స్వస్తిక్ చికారాతో కలిసి రెండో వికెట్కు 381 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

అప్పుడు చెన్నై.. ఇప్పుడు దిల్లీ..
ఐపీఎల్ లో సమీర్ రిజ్వీ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. 8 మ్యాచులు ఆడాడు. ఇప్పుడు ఐపీఎల్ 2025 కోసం దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసింది. రూ.95 లక్షలకు సొంతం చేసుకుంది.