క్రికెట్ ఫ్యాన్స్ను అలరించేందుకు.. ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తైన రెండు వారాల్లోనే మెగా టీ20 లీగ్ ఐపీఎల్ పండగ సిద్ధంగా ఉంది. దీంతో ఈ కొత్త సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తం 10 జట్లు ఈ మెగా లీగ్ లో హోరా హోరీగా పోటీ పడనుండగా.. ఇప్పటికే ఈ 10 జట్లలో 8 జట్ల కెప్టెన్లపై క్లారిటీ వచ్చేసింది. కేకేఆర్, దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజలు మాత్రం తమ సారథుల వివరాలను అధికారికంగా తెలుపలేదు.
పైగా ఈ రెండు ఫ్రాంఛైజీలు కూడా తమ జట్లకు కెప్టెన్లగా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ను విడిచి పెట్టేశాయి. దీంతో తమ జట్లకు కొత్త సారథులను ఎంపిక చేయడం అనివార్యమైంది. అయితే ఇప్పుడు దిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ గురించి మరో కొత్త సమాచారం బయటకు వచ్చింది. తమ జట్టుకు కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను నియమించాలని దిల్లీ ఫ్రాంఛైజీ దాదాపుగా నిర్ణయించుకున్నట్లు సమాచారం అందింది. వాస్తవానికి వేలం పాటు అయినప్పటి నుంచి అక్షర్ పటేల్ నే కొత్త సారథిగా ఎంపిక చేస్తారని ప్రచారం సాగింది.ఇప్పుడు అదే నిజం కానుందని దాదాపుగా స్పష్టమైంది. జట్టులో అనువజ్ఞుడైన కేఎల్ రాహుల్ ఉన్నప్పటికీ దిల్లీ యాజమాన్యం అక్షర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అక్షర్ పటేల్ ను సారథిగా ఎంపిక చేసే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. "దిల్లీ కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, డుప్లెసిస్ ఉన్నారు. వీరిలో అక్షర్ పటేల్ను రూ. 16.50 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అంటే కెప్టెన్సీ రేసులో అక్షర్ ముందంజంలో ఉన్నాడని అప్పుడే మనకు అర్థమైపోయింది. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న అతడు.. టీ20 జట్టుకు వైస్ కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడనున్నాడు. ఆట స్థితిగతులను బాగా ఆర్ధం చేసుకుంటూ... జట్టును నడిపించగల సమర్థత అతడిలో ఉంది. కాబట్టి అతడే దిల్లీ కెప్టెన్గా ఎంపిక అవుతాడు" అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
మిగతా కెప్టెన్లు వీరే..
చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్, ముంబయి ఇండియన్స్ కు హార్దిక్ పాండ్య, గుజరాత్ టైటాన్స్ కు శుభమన్ గిల్, సన్ రైజర్స్ హైదరాబాద్కు పాట్ కమిన్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ కు రిషభ్ పంత్, పంజాబ్ కింగ్స్కు శ్రేయస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్ కు సంజు శాంసన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.