Delhi Capitals New Captain : ఐపీఎల్ 2025 మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ జట్టు కొత్త కెప్టెన్ ఎవరనే ఉత్కంఠతకు తెర దించుతూ దిల్లీ క్యాపిటల్స్ కొత్త సారథి పేరును ప్రకటించింది. యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. రీసెంట్ గా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అక్షర్ కీలకంగా రాణించిన సంగతి తెలిసిందే. ఐదో స్థానంలో వచ్చి కీలక ఇన్నింగ్స్లు ఆడి ఆకట్టుకున్నాడు. అయితే జట్టులో సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఉన్నప్పటికీ.. అక్షర్ పటేల్ కే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ దిల్లీ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది.
"దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఎంపికవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన దిల్లీ యాజమానులకు, సపోర్టింగ్ స్టాఫ్ కు ధన్యవాదాలు. క్యాపిటల్స్ జట్టులో ఉండగానే నేను ఓ మంచిగా వ్యక్తిగా, క్రికెటర్ గా ఎదిగాను. ఇప్పుడు సారథిగా జట్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. మెగా ఆక్షన్ సమయంలో మా జట్టు కోచ్ లు.. అద్భుతమైన బ్యాలెన్సడ్ జట్టును తీసుకున్నారు. జట్టులో నాకు సలహాలు, సూచనలు ఇస్తూ.. సాయపడేలా, మంచి నాయకులు ఉన్నారు. ఈ సీజన్ ను విజయంతో ముగించాలని ఎదురుచూస్తున్నాను. నాపై ప్రేమాభిమానాలు కురిపిస్తూ మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు" అని అన్నాడు.
ఐపీఎల్ గణాంకాలు..
ఇప్పటి వరకు అక్షర్ పటేల్.. టీమిండియా తరఫున 14 టెస్టులు, 68 వన్డేలు, 71 టీ20లు ఆడాడు. అలానే 150 ఐపీఎల్ మ్యాచుల్లోనూ ఆడాడు. ఐపీఎల్ కెరీర్ లో 1,653 పరుగులు, 123 వికెట్లు పడగొట్టాడు.
