IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుతాలు చేస్తోంది. అయితే గత రెండు మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చాలా కష్టంగా మారాయి. ఈ సీజన్ లో అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. దీని తర్వాత రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో ఢిల్లీ గెలిచినప్పటికీ ముంబై, రాజస్థాన్ జట్లతో పోటీ అంత సులభం కాదని స్పష్టమైంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సూపర్ ఓవర్ లో అద్భుత విజయాన్ని సాధించడంతో పాటు కీలక రికార్డును కూడా తన పేరు మీద నమోదు చేసుకుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం 5సార్లు సూపర్ ఓవర్కు చేరుకుంది. అందులో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు సార్లు గెలిచింది. ఢిల్లీ ఇప్పుడు ఐపీఎల్ లో అత్యధిక సూపర్ ఓవర్లు గెలిచిన జట్టుగా అవతరించింది. ఈ విషయంలో పంజాబ్ కింగ్స్ జట్టును ఢిల్లీ అధిగమించింది. పంజాబ్ కింగ్స్ జట్టు మూడు సార్లు సూపర్ ఓవర్లో విజయం సాధించింది.

ఢిల్లీ-రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఇలా..
ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. టాస్ ఓడిపోయిన తర్వాత ఆతిథ్య జట్టును ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించారు. సొంత మైదానంలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆరంభం నిరాశపరిచింది. ముంబై ఇండియన్స్పై అద్భుతంగా ఆడిన కరుణ్ నాయర్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. జాక్ ఫ్రేజర్ మెక్గుర్క్ మరోసారి తన బ్యాటింగ్ లో రాణించలేకపోయాడు. అయితే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ బలమైన బ్యాటింగ్ కారణంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేయగలిగింది.
అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ జట్టు గొప్ప ఆరంభం లభించింది. అయితే కెప్టెన్ సంజు శాంసన్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత యశస్వీ జైస్వాల్ జట్టు తరఫున హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి అర్థభాగం వరకు రాజస్థాన్ జట్టు మ్యాచ్ పై పూర్తి నియంత్రణ సాధించింది. కానీ ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లు పుంజుకుని మ్.మ్యాచ్ ను టై చేశారు. దీని తర్వాత సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 11 పరుగులు చేసింది. అనంతరం సూపర్ ఓవర్ లక్ష్యఛేదనలో ఢిల్లీ 4 బంతుల్లో 13 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది.