IPL 2025 KL Rahul : భారత్ క్రికెట్లో కేఎల్ రాహుల్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా మంచిగానే రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్లోనూ అతడు అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అయితే మంచి ఫామ్ లో ఉన్న అతడు తన ఐపీఎల్ సంపాదనలో 80 శాతం పెట్టి భూమి కొన్నాడని తెలిసింది. తమ మామతో కలిసి ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేశాడట. ప్రస్తుతం ఆ భూమి విలువ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ కేఎల్ రాహుల్ ఎక్కడ? ఎంత పెట్టి కొన్నాడు? వంటి విషయాలను తెలుసుకుందాం..
ఎన్ని ఎకరాలు కొన్నాడంటే?
సినీ ప్రముఖులు, ఆటగాళ్ల సంపాదన గురించి తెలిసిందే. కోట్లలో ఆర్జిస్తుంటారు. సంపాదించే మొత్తంలో ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెడుతుంటారన్న సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, తమ మామ బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టితో కలిసి 7 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడని సమాచారం అందింది. పశ్చిమ థానేలోని ఓవలే ప్రాంతంలో రాహుల్ ఈ భూమిని కొనుగోలు చేసినట్లు క్రికెట్ అండ్ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

విలువ ఎంతంటే?
అయితే ఈ భూమి విలువ కోసం తన ఐపీఎల్ 2025 సంపాదనలో 80 శాతం ఇన్వెస్ట్ చేశాడట కేఎల్ రాహుల్. ప్రస్తుతం అతడు దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ రూ.14 కోట్లకు కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు. అందులో నుంచి రూ.9.58 కోట్లు ఖర్చు పెట్టి ఈ ల్యాండ్ కొన్నాడని తెలిసింది. దీని కోసం రూ.68.95 లక్షలు పెట్టి స్టాంప్ డ్యూటీ, రూ.30 వేలు రిజిస్ట్రేషన్ ఫీజ్ ఖర్చు చేశాడట. మార్చిలోనే ఈ రిజిస్ట్రేషన్ అయిందట. కాగా, రాహుల్ ఇప్పుడే కాదు గత కొద్ది కాలం నుంచే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతూ వస్తున్నాడు.
ఫామ్ లో రాహుల్..
ప్రస్తుతం ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటివరకు అతడు ఆడిన నాలుగు మ్యాచుల్లో 200 వరకు పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. దిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడగా.. అందులో నాలుగింటిలో గెలిచింది. పాయింట్ల పట్టికల్లో రెండో స్థానంలో నిలిచింది.