ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ఖరారు చేసింది. ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా అయిదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని తెలుస్తోంది. ఆర్టీఎమ్ కార్డ్ నిబంధనను ఈసారి కూడా తిరస్కరించిందని సమాచారం. మరికొన్ని గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానుంది.
అయితే రూల్స్ దాదాపుగా ఖరారు కావడంతో ఫ్రాంచైజీలు తమ వ్యూహాలకు పదునుపెట్టి చర్యలను వేగవంతం చేస్తున్నాయి. రిటైన్ ప్లేయర్ల జాబితాను ఖరారు చేస్తున్నాయి. అయిదు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తమ లిస్ట్ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ జాతీయ మీడియా ప్రకారం.. మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో సీఎస్కేకు ఇంకా స్పష్టత రాలేదు.

ఐపీఎల్ 2025కు తాను అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై ధోనీ ఫ్రాంచైజీకి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే మరోవైపు సీఎస్కే.. ధోనీ వచ్చే సీజన్కు అందుబాటులో ఉన్నా లేకపోయినా తన ప్రణాళికలు మొదలుపెట్టింది. చెపాక్ మైదానానికి సరిపోయే, ప్లేయింగ్ 11లో ఉంటూ సత్తాచాటే వికెట్ కీపర్ కోసం అన్వేషిస్తోంది. రిటైన్ లిస్ట్లో ధోనీ కోసం ఓ స్థానాన్ని ఉంచుతూ మరో వికెట్ కీపర్ను సిద్ధం చేస్తోంది.
రిటైర్మెంట్ ప్రకటించి అయిదేళ్లు పూర్తవ్వడంతో ధోనీని తక్కువ మొత్తానికి రిటైన్ చేసుకోవచ్చని సీఎస్కే భావిస్తోంది. అయితే గరిష్టంగా మరో సీజన్ మాత్రమే ఆడే ధోనీ కోసం ఓ స్లాట్ను భర్తీ చేయడం జట్టుపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో వేలంలో జట్టును బలంగా నిర్మించుకోవాలని సీఎస్కే భావిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీష పతిరనాలను రిటైన్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. కనీస ధర రూ.20 లక్షలతో సొంతం చేసుకున్న పతిరనాతో ఇప్పటికే రిటెన్షన్ గురించి ఒప్పందం కుదుర్చుకుంది.
మిగిలిన ఏకైక స్థానంలో వికెట్ కీపర్ అయిన డెవాన్ కాన్వేను తీసుకోవాలని సీఎస్కే భావిస్తోంది. గాయం కారణంగా గత సీజన్కు దూరమైన కాన్వేకు.. ఐపీఎల్లో ఓపెనర్గా మెరుగైన రికార్డు ఉంది. అయితే ఆల్రౌండర్లు రచిన్ రవీంద్ర, శివమ్ దూబెలను కూడా జట్టులో కొనసాగించాలని సీఎస్కే ఆలోచిస్తోంది. ధోనీ విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత రవీంద్ర, శివమ్ దూబె గురించి ఓ నిర్ణయానికి రానుంది. ధోనీ గత సీజన్లో 73 బంతుల్లో 161 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్కు వచ్చిన ధోనీ తన ఐపీఎల్ కెరీర్లో బెస్ట్ స్ట్రైక్రేటు 220.55తో ముగించాడు.
సీఎస్కే రిటైన్ లిస్ట్ (అంచనా): రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీష పతిరనా, డెవాన్ కాన్వే, ఎంఎస్ ధోనీ.