IPL 2025: రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో మంచి ఫామ్ లో ఉంది. ఆర్సీబీ ఈ సీజన్ లో వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రెండో మ్యాచ్లో ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్ను 50 పరుగుల తేడాతో ఓడించింది. మార్చి 28న ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కూడా అనేక రికార్డులు నమోదయ్యాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.
ఐపీఎల్లో పరుగుల పరంగా సీఎస్కేకు ఇది మూడో అతిపెద్ద ఓటమి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నై సూపర్ కింగ్స్ను 50 పరుగుల తేడాతో ఓడించింది. ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా ఇది సీఎస్కేకు మూడో అతిపెద్ద ఓటమి.

సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఎంఎస్ ధోనీ
ఐపీఎల్ చరిత్రలోనే సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా ఎంఎస్ ధోనీ నిలిచాడు. 236 మ్యాచ్లలో 4699 పరుగులు సాధించాడు. తద్వారా సురేశ్ రైనా(176 మ్యాచ్ లలో 4687) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. వీరిద్దరి తర్వాత డుప్లెసిస్(2721), రుతురాజ్ గైక్వాడ్(2433), అంబటి రాయుడు(1932) వరుస స్థానాల్లో ఉన్నారు.
సీఎస్కేపై కోహ్లీ అత్యధిక పరుగులు
ఐపీఎల్ చరిత్రలో చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. చెన్నైపై కోహ్లీ 1087 పరుగులు చేశాడు.
50 పరుగుల పార్టనర్షిప్ లేకుండా ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు
చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 50 పరుగుల భాగస్వామ్యం లేకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్ లో మొత్తం 342 పరుగులు నమోదయ్యాయి. 50 పరుగుల భాగస్వామ్యం లేకుండా ఐపీఎల్ మ్యాచ్ లో ఇది రెండో అత్యధిక పరుగులు.
రవీంద్ర జడేజా రికార్డు
ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 19 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ తో సహా 25 పరుగులు చేశాడు. కానీ జడేజా ఫామ్ మ్యాచ్ గెలవడానికి సరిపోలేదు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా ఐపీఎల్ చరిత్రలో 3000 పరుగులు చేసి.. 100 వికెట్లు తీసి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇంతకు ముందు చాలా మంది ఆల్రౌండర్లు ఆడినప్పటికీ ఎవరూ ఈ గొప్ప ఘనతను సాధించలేకపోయారు.