IPL 2025: ఐదుసార్లు ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా రెండో సీజన్లో ప్లేఆఫ్స్కు చేరకుండానే నిష్క్రమించింది. చెపాక్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమితో సీఎస్కే తన బ్యాగులను సర్దుకోవడానికి సిద్ధంగా ఉంది. 10వ మ్యాచ్లో 8వ ఓటమితో ప్రతి సీఎస్కే అభిమాని కోరుకునే కల నెరవేరలేదు. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన సీఎస్కే ఐపీఎల్ 2025లో చెత్తగా ఆడి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. స్టార్ బ్యాటర్లతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. బౌలర్లు కూడా నిరాశ పరిచారు. వరుసగా రెండోసారి ప్లేఆఫ్స్లో ఆడాలనే సీఎస్కే కల చెదిరిపోవడానికి గల మూడు కారణాలను తెలుసుకుందాం.
టాప్ ఆర్డర్ విఫలం
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ అద్భుతంగా కనిపించింది. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ నుంచి అందరూ అధిక అంచనాలు పెట్టుకున్నారు. అయితే ముగ్గురు బ్యాటర్లు సీజన్ అంతటా దారుణంగా విఫలమయ్యారు. గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ సీజన్ మధ్యలో జట్టును విడిచిపెట్టాడు. అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో చాలా మంచి పేరున్న రచిన్ రవీంద్ర ఈ సీజన్లో పేలవమైన ఫామ్లోనే ఉన్నాడు. డెవాన్ కాన్వే కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు.

బోల్తాపడిన మిడిల్ ఆర్డర్
సీఎస్కే జట్టును చూస్తే మిడిల్ ఆర్డర్ బలహీనంగా కనిపించింది. ప్రతి సీఎస్కే అభిమాని దేని గురించి అయితే భయపడ్డాడో సరిగ్గా అదే జరిగింది. ఐపీఎల్ 2025లో చెన్నై మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. దీపక్ హుడా, విజయ్ శంకర్, శివం దూబే వంటి బ్యాటర్లు తమ ఆటతీరుతో చాలా నిరాశపరిచారు. రవీంద్ర జడేజా బ్యాట్ కూడా సీజన్ అంతా నిశ్శబ్ధంగానే ఉంది. ఫినిషర్గా ఈ సారి ఎంఎస్ ధోని కూడా గత రెండు సీజన్లలో ఉన్న లక్షణాలను చూపించలేదు.
నిరాశపరిచిన బౌలర్లు
బ్యాటర్లు విఫలమవడమే కారుండా చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కూడా నిరాశపరిచారు. కొన్ని మ్యాచ్లు తప్ప ఖలీల్ అహ్మద్ తన లైన్ అండ్ లెంగ్త్ నుంచి తప్పుకుంటూ కనిపించాడు. గత సీజన్ వరకు సీఎస్కేకు అతిపెద్ద బలంగా కనిపించిన మతిషా పతిరానా ఐపీఎల్ 2025లో స్వేచ్ఛగా పరుగులు ఇచ్చాడు. స్పిన్ విభాగంలో నూర్ అహ్మద్ మ్యాజిక్ కనిపించినా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వారి ప్రతిభకు తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు.