IPL 2025 CSK VS RCB: ఐపీఎల్ 2025లో భాగంగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమవుతోంది. సీఎస్కే - ఆర్సీబీ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ సందర్భంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. మ్యాచుకు ముందు కీలక కామెంట్స్ చేశాడు. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీతో తలపడితే ఎలా ఉంటుందో వివరించాడు.
అప్పుడే మెసేజ్ చేసి చెప్పా..
జియోస్టార్ స్టార్ నహీ ఫార్లో రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. "ఆర్సీబీతో మ్యాచ్ ఆడేందుకు నిజంగా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ముఖ్యంగా ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ పై ఆడేందుకు రెడీగా ఉన్నాను. రజత్ పటీదార్ ను సారథిగా ఎంపిక చేసి ప్రకటించినప్పుడు వెంటనే నేను అతడికి మెసేజ్ చేసి అభినందించాను. మేం గత కొన్నేళ్లుగా మంచి స్నేహితులుగా ఉన్నాం. ఒకరినొకరు బాగా తెలుసు. పైగా ఆర్సీబీ బలమైన జట్లలో ఒకటి." అని చెప్పుకొచ్చాడు.

ఎప్పుడూ ఆసక్తికరమే..
ఆ తర్వాత విరాట్ కోహ్లీతో తలపడటం ఎలా ఉంటుందో వివరించాడు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. "వాళ్లు ప్రతిఏడాది గొప్పగానే చేస్తారు. ఈ ఏడాది కూడా గొప్పగానే ప్రారంభించారు. అయితే ప్రత్యర్థి జట్టులో విరాట్ కోహ్లీ ఉంటే, బరిలోకి దిగి ఆడుతుంటే, అతడితో మరింత తలపడాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుంది. చాలా కాలం నుంచి అతడు అద్భుతంగా ఆడుతున్నాడు. ఆర్సీబీ, దేశం తరఫున నిలకడగా అద్భుతంగా ఆడుతున్నాడు. కాబట్టి ఆర్సీబీపై ఆడటం గొప్పగా ఉంటుంది. అందుకే ముంబయి ఇండియన్స్ తర్వాత మేం అత్యంత ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూసే రెండో మ్యాచ్ ఇదే" అని రుతురాజ్ పేర్కొన్నాడు.