Prithvi Shaw: కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అనవసరమైన స్వీయ తప్పిదాలతో, క్రికెట్ లైఫ్ను నాశనం చేసుకున్న క్రికెటర్ ఎవరంటే.. అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు పృథ్వీ షా. అయితే ఇప్పుడు అతడి పేరు మరోసారి మార్మోగిపోతోంది. క్రికెట్ అభిమానులంతా అతడి గురించే తెగ చర్చిస్తున్నారు. సీఎస్కే అభిమానులైతే అతడి పేరును తెగ ట్రెండింగ్ చేస్తున్నారు. వీటన్నింటికీ కారణం.. ఇప్పుడతడు సీఎస్కే జట్టులోకి అడుగుపెట్టబోతున్నాడనే వార్త బయటకు రావడమే. రీసెంట్గా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు గాయమవ్వడంతో.. ఈ సీజన్కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో పృథ్వా షా వస్తాడని ఇప్పుడు టాక్ నడుస్తోంది.
అయితే వాస్తవానికి పృథ్వా షా.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్ సోల్డ్. కానీ ఇప్పుడు అతడిని తీసుకోవాలని సీఎస్కే యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం అందింది. ఎందుకంటే జట్టుకు టాప్ ఆర్డర్ లో ఆడగల బ్యాటర్ అవసరం ఏర్పడింది. అతడైతే సీఎస్కే జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇవ్వడంతో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్లపై ఒత్తిడిని తగ్గించగలడని భావన. అందుకే ఇప్పుడు అతడి పేరు తెగ మార్మోగిపోతోంది. ఈ క్రమంలోనే అతడి సంపాదన, ఇతర వ్యక్తిగత విషయాలు, రికార్డులు ట్రెండింగ్ లోకి వచ్చాయి.

అసలు ఎక్కడి నుంచి సంపాదిస్తాడు?
పృథ్వా షాకు ప్రధాన ఆదాయం క్రికెట్ నుంచే వస్తోంది. ఐపీఎల్ కాంట్రాక్టులు, బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, పెట్టుబడులు నుంచి అతడు ఆర్జిస్తున్నాడు. సచిన్ టెండుల్కర్ తర్వాత చిన్న వయసులోనే అరంగేట్రంలోనే టెస్ట్ సెంచరీ బాదిన క్రికెటర్ గా నిలిచాడు. దీంతో అతడికి ఐపీఎల్ లో మంచి అవకాశాలు వచ్చాయి. దిల్లీ క్యాపిటల్స్ మొదటగా రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత అతడి ఐపీఎల్ శ్యాలరీ రూ.7.5 కోట్లకు పెరిగింది. 2024 సీజన్ లో రూ.8 కోట్లు అందుకున్నాడు. కానీ ఆ తర్వాత క్రమశిక్షణరాహిత్యం కారణంగా 2025లో అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు.
బీసీసీఐ నుంచి సంపాదిస్తున్నాడంటే ?
పృథ్వా షా.. బీసీసీఐ నుంచి కూడా ఆర్జించాడు. అతడు 5 టెస్టులు, 6 వన్డేలో, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ప్రతీ వన్డే మ్యాచుకు రూ.6 లక్షలు, ప్రతీ టీ20 మ్యాచుకు రూ.3 లక్షలు అందుకున్నాడు. అయితే ప్రస్తుతం అతడు బీసీసీఐ కాంట్రాక్ట్ లో లేడు. అందుకే బోర్డు నుంచి అతడికేమీ జీతం అందట్లేదు.
బిగ్ బ్రాండ్ల నుంచి కోట్ల రెమ్యునరేషన్..
ఎమ్మారెఫ్, వీవో, ప్రొటీన్ ఎక్స్, భారత్ పే, నైక్, బోట్, ఆదిదాస్, పుమా, ప్రొటినిక్స్ సహా పలు బిగ్ బ్రాండ్ల నుంచి కూడా కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాడు పృథ్వీ షా. అతడికి బంద్రా వెస్ట్ లో లగ్జరీ అవార్ట్మెంట్ ఉంది. దాని విలువ రూ.10.5 కోట్లు అని సమాచారం. 2024లో బాంద్రాలోనే మరో సీ ఫేసింగ్ అపార్ట్మెంట్ కూడా కొనుగోలు చేశాడు. దాని విలువ రూ.15 కోట్లు అని తెలిసింది. ఇంకా అతడి దగ్గర రూ.70 లక్షల విలువైన బీఎండబ్ల్యూ 6 సిరీస్ కార్ కూడా ఉంది.
ఐపీఎల్ కెరీర్..
2018 నుంచి 2024 వరకు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు పృథ్వీ షా. 79 మ్యాచ్ల్లో 23.95 సగటుతో, 147.47 స్ట్రైక్ రేట్తో 1892 పరుగులు చేశాడు. అందులో 14 అర్థ సెంచరీలు ఉన్నాయి. అయితే ఇప్పుడీ భారత మాజీ అండర్-19 కెప్టెన్ ఫిట్నెస్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే ఇప్పుడతడు నిజంగానే సీఎస్కేలోకి వస్తే.. ధోని మార్గదర్శకత్వంలో మంచి రాటుదేలే అవకాశం ఉంది.