ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ జర్నీ సాఫీగా సాగట్లేదు. ఈ సీజన్ ను ఘనంగా ఆరంభించినప్పటికీ.. ఆ తర్వాత రెండు మ్యాచుల్లోనూ వరుసగా ఓడిపోయింది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల ఆధారంగా పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే సీఎస్కే యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులోకి ముంబయి జట్టుకు చెందిన 17 ఏళ్ల యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ ను తెచ్చేందుకు సిద్ధమైంది.
ఇంతకీ అతడెవరంటే?
సీఎస్కే తమ జట్టులోకి ఆయుశ్ మత్రేను ఆహ్వానించింది. చెపాక్ స్టేడియానికి ట్రయల్స్ కు పిలిచింది. అతడు అండర్ 19 ఆసియా కప్ 2025లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. జట్టు తరఫున అద్భుతంగా రాణించాడు. యూఏఈ జట్టుపై 67 పరుగులు చేసి వెలుగులోకి వచ్చిన ఇతడు.. సెమీఫైనల్ లో లంకపై 34 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఫైనల్ లో ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు.

అవును నిజమే.. కానీ...
అయితే ఐపీఎల్ 2025 వేలంలో అతడు అన్సోల్డ్గా మిగిలినప్పటికీ.. దేశవాళీ క్రికెట్లో అతడి అద్భుతమైన రీసెంట్ పెర్ఫామెన్స్ను సీఎస్కే టాలెంట్ స్కౌట్స్ గుర్తించింది. దీంతో అతడిని ట్రయల్స్కు ఆహ్వానించింది. ఈ విషయాన్ని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ కూడా స్పష్టం చేశారు. "అవును మేం అతడిని ట్రయల్స్ కు ఆహ్వానించాం. మా టాలెంట్ స్కౌట్స్ ను అతడు తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కానీ వెంటనే అతడిని తీసుకునే ప్రణాళికలను ఏమీ లేవు. కేవలం ఇది ట్రయల్ మాత్రమే. మేం ఆలోచిస్తాం." అని పేర్కొన్నాడు. ఒకవేళ మత్రేను జట్టులోకి తీసుకోవాల్సి వస్తే.. ఎవరైన గాయపడిన ప్లేయర్ స్థానంలో రీప్లేస్మెంట్ చేయొచ్చు.
దేశవాళీలో అద్భుత ప్రదర్శన..
మత్రే.. 2024-25 దేశవాళీ క్రికెట్ సీజన్ లో, ముఖ్యంగా విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. ముంబయి జట్టు తరఫున అరంగేట్రం చేసిన అతడు.. 7 మ్యాచుల్లోనే 65.42 సగటుతో 458 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. రంజీ ట్రోఫీలో 8 మ్యాచుల్లో 33.64తో 471 రన్స్ సాధించాడు. అందులో మహారాష్ట్రపై చేసిన 176 అతడి టాప్ స్కోర్.