CSK vs GT: అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్లో బ్యాటర్లందరూ అద్భుతంగా రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. గుజరాత్ జట్టు 231 పరుగులు భారీ లక్ష్యాన్ని ముందుంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే జట్టు శుభారంభం లభించింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే, డెవాన్ కాన్వేలు అద్భుతంగా ఆడారు.
సీఎస్కే బ్యాటర్ ఆయుష్ మాత్రే విధ్వంసం సృష్టించాడు.ఒకే ఓవర్లో 28 పరుగులు బాదాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీ దాటిస్తూ రెచ్చిపోయాడు. గుజరాత్ పేసర్ అర్షద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో వరుసగా ఆరు బంతుల్లో 2,6,6,4,4,6 ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అర్షద్ ఖాన్ ఓవర్లో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఆయుష్ మాత్రే ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ 2 ఓవర్లలోనే 34 పరుగులు చేసింది. అర్షద్ బౌలింగ్ లో 3 సిక్సులు, 2 బౌండరీలు బాదాడు. ఆయుష్ మాత్రే మొత్తంగా 17 బంతుల్లో 34 పరుగులు చేశాడు. 200 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ క్రీజులో ఉన్నంతసేపు గుజరాత్ జట్టును ఓ ఆట ఆడుకున్నాడు.

తన బ్యాటింగ్ తో అదరగొట్టిన ఆయుష్ మాత్రే.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో సిరాజ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఆయుష్ మాత్రే ఔటైన తర్వాత ఉర్విల్ పటేల్ దంచికొట్టాడు. 19 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. సాయి కిషోర్ వేసిన 10వ ఓవర్లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. అనంతరం శివమ్ దూబే, డెవాన్ కాన్వేలు రెచ్చిపోయి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపించింది. కానీ శివమ్ దూబే 8 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు.చివర్లో డెవాల్డ్ బ్రెవిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బ్రెవిస్ కేవలం 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సులతో 57 పరుగులు చేశాడు. కేవలం 19 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. రవీంద్ర జడేజా 18 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్తో 21 పరగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టగా.. సాయి కిషోర్, రషీద్ ఖాన్, షారుక్ ఖాన్ తలో వికెట్ తీశారు.