IPL 2025: ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఒక పీడకలలా మారింది. ఈ ఏడాది ఆ జట్టు వరుస పరాజయాలను చవిచూసింది. ఆ జట్టు పరిస్థితి ఎంతగా మారిందంటే సొంత మైదానంలో కూడా గెలవడం కష్టమైంది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ కు దూరం కావడంతో జట్టు కష్టాలు మరింత పెరిగాయి. గైక్వాడ్ గాయం కారణంగా దూరం కావడంతో మరోసారి మహేంద్ర సింగ్ ధోనిని యాజమాన్యం కెప్టెన్ గా చేసింది. ధోని కెప్టెన్సీలో జట్టు ఐదు ట్రోఫీలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎస్కే ముందున్న అతి పెద్ద టెన్షన్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మరో ఆటగాడిని తీసుకురావడం. గైక్వాడ్లా ఆడే ఆటగాడిని జట్టులోకి తీసుకురావాలి.
పృథ్వీ షా జట్టుకు కొత్త లైఫ్ లైన్?
ఈ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ జట్టు తరపున మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో సీఎస్కే జట్టుకు గైక్వాడ్ స్థానంలో టాప్ ఆర్డర్ లో ఆడగల బ్యాటర్ అవసరం. గత సంవత్సరం మెగా వేలంలో అమ్ముడుపోకుండా నిలిచిన యువ ఆటగాడు పృథ్వీ షా జట్టులో ఈ లోటును భర్తీ చేయగలడు. పృథ్వీషా సీఎస్కే జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇవ్వడమే కాకుండా.. తన బ్యాటింగ్తో జట్టులోని ఇతర ఆటగాళ్లపై ఒత్తిడిని కూడా తగ్గించగలడు. ఇది జరిగితే పృథ్వీ షా సీఎస్కే జట్టుకు కొత్త లైఫ్ లైన్ కాగలడు.

ఢిల్లీ తరపున ఆడిన పృథ్వీషా
25 ఏళ్ల ముంబై ఓపెనర్ 2018 నుంచి 2024 వరకు ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్లో భాగంగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన పృథ్వీ షా.. 79 మ్యాచ్ల్లో 23.95 సగటుతో, 147.47 స్ట్రైక్ రేట్తో 1892 పరుగులు చేశాడు. ఈ కాలంలో పృథ్వీ షా బ్యాట్ నుంచి 14 అర్థ సెంచరీలు వచ్చాయి. అయితే భారత మాజీ అండర్-19 కెప్టెన్ కూడా తన ఫిట్నెస్పై విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కానీ ధోని మార్గదర్శకత్వంలో పృథ్వీ షా బాగా రాణించగలడు. ఇదే జరిగితే పృథ్వీ షా పాడైపోయిన కెరీర్ మళ్లీ గాడిన పడే అవకాశం ఉంది.