వచ్చే ఐపీఎల్ సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ ఆడతాడా? మెగా వేలానికి ముందు 43 ఏళ్ల ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంటుందా? రిటైర్మెంట్ ప్రకటించి అయిదేళ్ల గడిచిన ఆటగాళ్లకు వేలంలో బీసీసీఐ నిబంధనలను మారుస్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు క్రికెట్ అభిమానులను వెంటాడుతున్నాయి. అయితే ధోనీ వచ్చే సీజన్లో సీఎస్కేతో కొనసాగినా.. వికెట్ కీపర్గా మైదానంలోనే ఉంటాడా? లేదా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతాడా అనే సందేహాలు ఉన్నాయి.
2025 సీజన్ ముగిసిన అనంతరం ధోనీ ఐపీఎల్ ఆడటం అనుమానమే. అయితే కెప్టెన్సీలో తన వారుసుడిగా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసిన ధోనీకి మరో బాధ్యత మిగిలి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్కు శాశ్వత వికెట్ కీపర్ను అందించి వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ పేరును సీఎస్కే ఫ్రాంచైజీ పరిశీలిస్తోంది. దానికి ధోనీ కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది.

సీఎస్కేలోకి రిషభ్ పంత్ వస్తాడని గతంలో వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ను పంత్ వదిలి రావడం కష్టమే. ఈ స్థితిలో ఇషాన్ కిషన్పై సీఎస్కే ప్రాంఛైజీ ఫోకస్ చేసింది. రిటైన్ ప్లేయర్ల పరిమితి దృష్ట్యా ముంబై ఇండియన్స్ ఇషాన్ను వదులుకునే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ టూ మ్యాచ్ కార్డ్ అమల్లోకి వస్తే ఇషాన్ను తిరిగి ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాలని ముంబై చూస్తోంది. అయితే ఇషాన్కు ముంబై ఇండియన్స్ ఎంతమేర ధరను వెచ్చిస్తుందనే కీలకం.
గత ఐపీఎల్ వేలాల్లో ఇషాన్ కిషన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కోసం గట్టిగానే ప్రయత్నించింది. కానీ బ్యాకప్ కీపర్ కోసమే అనే కోణంలో ఇషాన్కు పెద్దమొత్తాన్ని వెచ్చించడానికి సీఎస్కే ఇష్టపడలేదు. కానీ ఈసారి ఇషాన్ వేలంలోకి వస్తే వదిలిపెట్టకూడదని చెన్నై ఫ్రాంచైజీ భావిస్తోంది. టీమిండియాలో చోటు, బీసీసీఐ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్ ఇటీవల తిరిగి ఫామ్లోకి వచ్చాడు. దులీప్ ట్రోఫీలో సెంచరీతో సత్తాచాటాడు. కాగా, ధోనీ సొంత రాష్ట్రమైన జార్ఖండ్కు చెందిన వాడే ఇషాన్ కిషన్.
కాగా, నవంబర్ మూడు లేదా ఆఖరి వారంలో మెగా ఆక్షన్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా విదేశాల్లో మెగా వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అబుదాబి వేదికగా ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక రిటైన్షన్ రూల్స్పై ఈ నెలాఖరులోపు స్పష్టత రానుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్ల జాబితాను ప్రకటించడానికి నవంబర్ 15న ఆఖరి తేదీని ఖరారు చేసినట్లుగా సమాచారం.