IPL 2025: భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గురువారం రాత్రి ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ రద్దు చేయబడింది. ఆ సమయంలో ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్టేడియానికి వచ్చి ధర్మశాల స్టేడియం నుంచి ప్రేక్షకులందరూ వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూకశ్మీర్ సహా పలు నగరాలపై పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ధర్మశాలలో ఆటను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ధర్మశాల స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు ఆటగాళ్లను కూడా అక్కడి నుంచి తరలించారు. ఆటగాళ్లను సురక్షితంగా వారి హోటళ్లకు చేర్చారు. ఈ క్రమంలో ఓ చీర్లీడర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చీర్లీడర్ వీడియో
ఆ వీడియోలో చీర్లీడర్ భయపడుతున్నట్లు కనిపించింది. చీర్లీడర్ మాట్లాడుతూ.. "మ్యాచ్ మధ్యలో స్టేడియం మొత్తం ఖాళీ చేయబడింది. మ్యాచ్ మధ్యలోనే అందరిని పంపించేశారు. స్టేడియం అంతా భయంగా కనిపించింది. బాంబులు పడతాయని అందరూ అరుస్తున్నారు. మేము ధర్మశాల నుంచి సురక్షితంగా బయటపడాలనుకుంటున్నాం. ఐపీఎల్ ప్రతినిధులు సరైన చర్యలు తీసుకున్నారు. నేను ఏడవడం లేదు కానీ ఇంకా షాక్లోనే ఉన్నాను." అంటూ చీర్లీడర్ భయాందోళనకు గురైన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అరుణ్ ధుమాల్ వీడియో కూడా వైరల్
భారత్లోని అనేక నగరాలపై పాకిస్థాన్ దాడుల తర్వాత ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ను ఆపి ప్రేక్షకులందరూ మైదానం నుంచి ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకులందరినీ కూడా మైదానం నుంచి సురక్షితంగా తరలించారు.
ఆటగాళ్ల కోసం ప్రత్యేక రైలు
బీసీసీఐ ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా ఆటగాళ్లను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రాంతాని సురక్షితంగా తీసుకెళ్తారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్ జరుగుతాయా లేదా వాయిదా పడనున్నాయా అనే విషయంపై ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
10.1 ఓవర్లు ఆడిన పంజాబ్
ఈ మ్యాచ్లో కేవలం 10.1 ఓవర్లు మాత్రమే ఆడారు. ఈ సమయంలో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తూ 1 వికెట్ కోల్పోయి 122 పరుగులు చేసింది. పంజాబ్ తరపున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రియాన్ష్ ఆర్య 34 బంతుల్లో 70 పరుగులు చేసి అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 5 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇది కాకుండా ప్రభ్సిమ్రాన్ సింగ్ 50 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.