ఐపీఎల్ మెగా వేలానికి వేళైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నేడు, రేపు మెగా ఆక్షన్ జరగనుంది. విదేశాల్లో వేలం జరగడం వరుసగా ఇది రెండోసారి. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. వేలంలో 577 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వాళ్లలో మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు.
మెగా వేలంలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఆక్షన్ ఆల్టైమ్ రికార్డులను పంత్ బద్దలుకొట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వేలంలో ఆంధ్ర కుర్రాళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. షేక్ రషీద్, బైలపూడి యశ్వంత్, అశ్విన్ హెబ్బర్, పృథ్వీరాజ్, PVSN రాజు, మారంరెడ్డి హేమంత్ రెడ్డి, మనీశ్ రెడ్డి, యద్దెల గిరీశ్ రెడ్డి, గిరినాథ్ రెడ్డి వేలానికి వస్తున్నారు.

ఈ ఆటగాళ్లంతా కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వస్తున్నారు. బౌలర్ గిరీశ్ కుమార్ రెడ్డి ఏపీలోని తిరుపతి జిల్లాకు చెందిన ఆటగాడు. ఎస్వీయూలో బీటెక్ పూర్తి చేసిన గిరీశ్ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో మంచి ప్రదర్శన కనబరిచి 10 మ్యాచుల్లోనే 18 వికెట్లు తీశాడు. ఇక గిరినాథ్ రెడ్డి అనంతపురం జిల్లా కదిరికి చెందిన ప్లేయర్. గుంటూరుకి చెందిన షేక్ రషీద్, పృథ్వీరాజ్యర్రా క్రికెట్ అభిమానులకు సుపరిచితమే.
కాగా, ఫ్రాంచైజీలలో పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 41 కోట్లు ఉన్నాయి. ఇక సీఎస్కే- రూ.55 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్- రూ. 73 కోట్లు, కేకేఆర్- రూ. 51 కోట్లు, ఆర్సీబీ- రూ. 53 కోట్లు, లక్నో- రూ. 69 కోట్లు, ముంబై ఇండియన్స్- రూ.45 కోట్లు, ఎస్ఆర్హెచ్- రూ.45 కోట్లు, గుజరాత్ టైటాన్స్- రూ. 69 కోట్లు ఉన్నాయి.