IPL 2025: బీసీసీఐకి బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్-2025 సందర్భంగా తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కి ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. ప్రతి ఏటా ఐపీఎల్ లో ఏదో ఒక కొత్త హంగుతో అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రోబోటిక్ డాగ్ ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ల టీంలో చేరింది. ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ రోబోటిక్ కుక్కను నిర్వాహకులు ఐపీఎల్ అభిమానులకు పరిచయం చేశారు. రిమోట్ తో ఆపరేట్ చేసే ఈ రోబోటిక్ కుక్కకు "చంపక్" అని పేరు కూడా పెట్టారు. సోషల్ మీడియాలో రోబోటిక్ కుక్కకు తాము ఎంచుకున్న పేర్లలో ఎక్కువ మంది చంపక్ పేరుకు ఓటేశారని.. అందుకే ఆ పేరు పెట్టినట్లు వెల్లడించారు.
అయితే చంపక్ పేరు విషయంలో ఢిల్లీ ప్రెస్ పత్రా పకాశన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 1968వ సంవత్సరం నుంచి తాము చంపక్ పేరుతో పిల్లల కోసం మ్యాగజైన్ ప్రచురిస్తున్నట్లు.. తమ అనుమతి లేకుండానే తమ ట్రేడ్ మార్కును వాడుకున్నారని న్యాయస్థానాన్ని విన్నవించింది. ఈ మేరకు ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు.. ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా బీసీసీఐకి కోర్టు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా సమాధానంతో తమ ముందుకు రావాలని బీసీసీఐ, ఐపీఎల్ ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను జులై 9కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

కాపీ రైట్ కేసు
పిటిషనర్ తరఫున వాదించిన న్యాయవాది అమిత్ గుప్తా.. రోబో కుక్కకు చంపక్ అని పేరు పెట్టడం రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కును ఉల్లంఘించడమేనని, చంపక్ ఒక ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ కాబట్టి వాణిజ్యపరంగా దోపిడీకి పాల్పడటమేనని వాదించారు. ఐపీఎల్ మ్యాచ్ ల సమయంలో వినోదం కోసం చంపక్(రోబో డాగ్)ని ప్రసారం చేశారని.. దీని వల్ల పిటిషనర్ కు తీరని నష్టం వాటిల్లిందని.. బ్యాండ్ వాల్యూ దెబ్బతిందని వాదించారు. బీసీసీఐ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జె.సాయి దీపక్ ఈ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ.. చంపక్ అనేది ఒక పువ్వు పేరు అని.. ప్రజలు రోబో కుక్కను ఒక పత్రికతో కాకుండా ఒక టీవీ సిరీస్ లోని పాత్రతో పోల్చుకుంటారని అన్నారు.
బీసీసీఐ, ఐపీఎల్ తమ ట్రేడ్ మార్క్ ను ఉల్లంఘించకుండా నిరోధించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టును కోరారు. దాని ట్రేడ్మార్క్కు జరిగిన నష్టానికి రూ. 2 కోట్ల నష్టపరిహారాన్ని కోరారు.