క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించేందుకు.. ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తైన రెండు వారాల్లోనే మెగా టీ20 లీగ్ ఐపీఎల్ రెడీగా ఉంది. దీంతో ఈ కొత్త సీజన్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తం 10 జట్లు ఈ ఐపీఎల్ 2025 సీజన్లో హోరా హోరీగా పోటీ పడనున్నాయి. అయితే తాజాగా ఆర్సీబీ కొత్త కెప్టెన్గా రజత్ పటీదార్ నియమితుడయ్యాడు. దీంతో ఐపీఎల్ లో పాల్గొనబోయే 10 జట్లలో 8 జట్ల కెప్టెన్లపై ఓ క్లారిటీ వచ్చింది. కానీ ఆ రెండు జట్ల సారథులు ఎవరన్నది ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇంతకీ ఆ జట్లు ఏవంటే?
ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్ కు సంబంధించి తాజాగా డీటెయిల్స్ లీక్ అయ్యాయి. మార్చి 23 నుంచి ప్రారంభం అవుతుందనుకున్న ఈ మెగా లీగ్ 18వ ఎడిషన్.. ఒక్క రోజు ముందే మార్చి 22న ఆరంభం కానున్నట్లు తెలిసింది. ఓపెనింగ్ మ్యాచ్ గతేడాది ఛాంపియన్ గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుందని తెలిసింది. ఈడెన్ గార్డెన్స్లో దీనిని నిర్వహించనున్నారు.

ఆ రెండింటికి ఎవరో..
అయితే ఈ ఆర్సీబీ - కేకేఆర్ జట్ల కెప్టెన్సీ విషయానికొస్తే.. తాజాగా బెంగళూరు జట్టు తమ కొత్త కెప్టెన్ ఎవరో ప్రకటించింది. యంగ్ ప్లేయర్ రజత్ పటీదార్ తమ కొత్త సారథి అని తెలిపింది. కానీ కేకేఆర్ విషయంలో మాత్రం తమ కెప్టెన్ ఎవరన్నది మాత్రం ఇంకా ఓ స్పష్టత రావడం లేదు. దిల్లీ క్యాపిటల్స్ కు కూడా కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తాడా లేదా అక్షర్ పటేల్ కెప్టెన్ గా నియమితుడవుతాడా అని ఇంకా తెలియలేదు. ఐపీఎల్ లో ఉన్న 10 జట్లలో ఈ రెండు టీమ్స్ కెప్టెన్ల గురించే క్లారిటీ లేదు.
మిగతా కెప్టెన్లు వీరే..
చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్, ముంబయి ఇండియన్స్ కు హార్దిక్ పాండ్య, గుజరాత్ టైటాన్స్ కు శుభమన్ గిల్, సన్ రైజర్స్ హైదరాబాద్కు పాట్ కమిన్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ కు రిషభ్ పంత్, పంజాబ్ కింగ్స్కు శ్రేయస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్ కు సంజు శాంసన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.