IPL 2025: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తల మధ్య వాయిదా పడిన ఐపీఎల్ 2025ను బీసీసీఐ వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఉద్రిక్తతలు తగ్గిపోవడం ఐపీఎల్ ఈ నెల 17 నుంచి పున:ప్రారంభం కానుంది. ఉద్రిక్తతల కారణంగా స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ప్లేయర్లు.. పరిస్థితులు సద్దుమణగడంతో తిరిగి భారత్కు చేరుకుంటున్నారు. బీసీసీఐ కొత్త షెడ్యూల్ ప్రకారం మే 17న తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి కీలక విదేశీ ఆటగాడు భారత్కు తిరిగి వచ్చాడు.
ఆర్సీబీ జట్టులో చేరిన లుంగీ ఎంగిడి
ఐపీఎల్ 2025 వారం పాటు నిలిపివేయబడిన తర్వాత దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడి భారత్కు తిరిగి వచ్చాడు. లుంగీ ఎంగిడి ఇండియాకు తిరిగి వచ్చి ఆర్సీబీ జట్టులో చేరాడు. లుంగీ ఎంగిడి పునరాగమనంతో ఆర్సీబీ, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఫాస్ట్ బౌలర్ రాబోయే మ్యాచ్లలో చాలా కీలక పాత్రను పోషించబోతున్నాడు. ఎందుకంటే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్వుడ్ తిరిగి రావడానికి మొగ్గు చూపడం లేదని తెలిసింది. ఈ క్రమంలో లుంగి ఎంగిడి ముఖ్య పాత్రను పోషించాల్సి ఉంటుంది.

ఈ ముగ్గురు కూడా..
ఇది కాకుండా ఆర్సీబీ తరఫున ఆడేందుకు మరో ముగ్గురు కీలక ఆటగాళ్లు కూడా భారత్కు తిరిగి వస్తున్నారు. ఆర్సీబీ జట్టు తరఫున ఆడుతున్న ఆర్సీబీ పవర్ హిట్టర్ రొమారియో షెపర్డ్ ఇండియాకు తిరిగి వస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 14 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. రొమారియో షెపర్డ్ ఒకే ఓవర్లో 30 పరుగులు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. అతడితో పాటు ఇంగ్లాండ్కు చెందిన జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్స్టోన్ కూడా ఆర్సీబీలో చేరబోతున్నారు.
ప్లేఆఫ్స్కు ఒక విజయం దూరంలో ఆర్సీబీ
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ 11 మ్యాచ్లు ఆడింది. అందులో ఆ జట్టు 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ప్రస్తుతం ఆర్సీబీ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ తదుపరి మ్యాచ్ మే 17న కోల్కతాతో జరగనుంది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలని జట్టు కోరుకుంటోంది.
ఇదిలా ఉండగా.. కేకేఆర్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ప్లేయర్లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ కూడా మరికొన్ని గంటల్లో ఇండియాలో అడుగుపెట్టబోతున్నారు. ఇండియాకు వస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఆండ్రీ రెస్ట్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆండ్రీ రస్సెల్తో పాటు రొమారియో షెపర్డ్, సునీల్ నరైన్, కేకేఆర్ మెంటార్ డ్వేన్ బ్రావో ఉన్నారు. న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తిరిగి ముంబై జట్టులో చేరనున్నాడని తెలుస్తోంది.