IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో నాలుగు జట్లు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్కు చేరుకున్నాయి. తాజాగా పంజాబ్ కింగ్స్ జట్టుకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చింది. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు మార్కస్ స్టొయినీస్, జోష్ ఇంగ్లీష్, కైల్ జేమిసన్, ఆరోన్ హార్డీ జట్టుతో చేరారు. ఈ కీలక ఆటగాళ్లు జట్టుతో చేరడంతో పంజాబ్ కింగ్స్ జట్టు చాలా బలంగా మారనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన పంజాబ్ జట్టు టాప్-2 స్థానాల్లో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ నలుగురు ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లిపోయారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్కు ఈ ఆటగాళ్లు గైర్హాజరయ్యారు. ఇప్పుడు మనస్సు మార్చుకుని ఇండియాకు తిరిగి వచ్చి పంజాబ్ కింగ్స్ జట్టులో చేరారు. కాగా 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. 2014 తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరడం ఇదే తొలిసారి. ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే ఉత్సాహంతో ఉంది. పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

పంజాబ్ కింగ్స్ ఇంకా 2 లీగ్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండు లీగ్ మ్యాచ్లలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్లలో గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ను చేరుకునే అవకాశం కూడా ఉంది. మే 24న ఢిల్లీతో, మే 26న ముంబై ఇండియన్స్ జట్లతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. స్టొయినీస్, జోష్ ఇంగ్లీస్ జట్టులో చేరడంతో పంజాబ్ కింగ్స్ జట్టుకు మరింత బలం చేకూరింది. స్టొయినీస్ 7 ఇన్నింగ్స్లలో 167.34 స్ట్రైక్ రేట్తో 82 పరుగులు చేయగా.. ఇంగ్లీస్ ఆరు ఇన్నింగ్స్లలో 139.39 స్ట్రైక్ రేట్తో 92 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియాకు చెందిన ఆల్రౌండర్ ఆరోన్ హార్డీ ఈ సీజన్లో ఇంకా ఆడలేదు. ఐపీఎల్ వేలంలో రూ.1.25 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. ఈ సీజన్ ఆరంభంలో గాయపడిన తన దేశస్థుడు లాకీ ఫెర్గూసన్ స్థానంలో వచ్చిన కైల్ జేమీసన్ కూడా పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడలేదు. లీగ్ దశ ముగింపులో మార్కో జాన్సెన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం వెళ్లిన తర్వాత వారిలో ఒకరైనా ప్లేఆఫ్స్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.