IPL 2025: భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్రతల కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ను పునఃప్రారంభించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఐపీఎల్ను తిరిగి ప్రారంభించేందుకు బోర్డు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ నెల 16 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టోర్నమెంట్లోని మిగిలిన మ్యాచ్లకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను త్వరలో విడుదలు చేస్తామని బీసీసీఐ చెబుతోంది. ఐపీఎల్ పునఃప్రారంభమవుతున్న వేళ ఆర్సీబీకి భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఆ జట్టు స్టార్ బౌలర్ హేజిల్వుడ్ గాయం కారణంగా ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లకు జట్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అతిపెద్ద బలం అని నిరూపించుకున్న జోష్ హేజిల్వుడ్ మిగిలిన మ్యాచ్లకు ఆడటం కష్టమే. హేజిల్వుడ్ భుజం గాయంతో బాధపడుతున్నాడు. రాబోయే మ్యాచ్లలో పాల్గొనడానికి భారత్కు వచ్చే సూచనలు కన్పించడం లేదు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హేజిల్వుడ్ మూడో స్థానంలో ఉన్నాడు. హేజిల్వుడ్ 18 వికెట్లు పడగొట్టాడు. మే 3న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో మ్యాచ్కు దూరమయ్యాడు.

ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బ
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025కు ఒక వారం విరామం ఇవ్వబడింది. అయితే మిగిలిన మ్యాచ్లకు సంబంధించిన కొత్త షెడ్యూల్ కు ముందే అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆర్సీబీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్లో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ మిగిలిన మ్యాచ్ల్లో ఆడటం చాలా కష్టంగా కనిపిస్తోంది.
ప్లేఆఫ్స్కు చేరువలో ఆర్సీబీ
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ అద్భుతంగా రాణిస్తోంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు మొత్తం 11 మ్యాచ్లు ఆడగా.. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 మ్యాచ్ల్లో గెలిచింది. అదే సమయంలో ఆ జట్టు 3 మ్యాచ్ల్లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆర్సీబీ మొత్తం 16 పాయింట్లతో ఉంది. ప్లేఆఫ్ టికెట్ దక్కించుకోవాలంటే ఆర్సీబీకి ఒక్క విజయం అవసరం. రజత్ పాటిదార్ నాయకత్వంలో జట్టు ఆటగాళ్లు చాలా బాగా రాణించారు. జట్టు బౌలర్లు కూడా దూకుడుగా కనిపించారు.