IPL 2025: పంజాబ్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. ఈ సీజన్ లో అద్భుతంగా ప్రదర్శన ఇస్తున్న శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టుకు లాకీ ఫెర్గూసన్ నిష్క్రమణ పెద్ద దెబ్బగా మారింది. గత శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో లాకీ ఫెర్గూసన్ రెండు బంతులు మాత్రమే బౌలింగ్ చేసి తీవ్రమైన కాలినొప్పితో మైదానాన్ని వీడాడు. ఎడమ తొడ భాగాన్ని చేతితో పట్టుకొని కనిపించాడు. ఫిజియోతో మాట్లాడిన తర్వాత లాకీ ఫెర్గూసన్ స్టేడియం వదిలి వెళ్లి మళ్లీ బౌలింగ్ చేయడానికి తిరిగి రాలేదు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రలో రెండో అతిపెద్ద లక్ష్య ఛేదనను కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేసింది.
లాకీ ఫెర్గూసన్ గైర్హాజరీ పంజాబ్ కింగ్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఫెర్గూసన్ గైర్హాజరీలో సన్రైజర్స్ హైదరాబాద్ 246 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి విజయాన్నందుకుంది. లాకీ ఫెర్గూసన్ గాయంతో దూరమవ్వడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. అవసరమైనప్పుడల్లా వికెట్ తీసే బౌలరని చెప్పుకొచ్చాడు.

ఫెర్గూసన్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు?
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ స్థానంలో పంజాబ్ కింగ్స్ వద్ద ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేవియర్ బార్ట్లెట్తో సహా మరికొన్ని ఎంపికలు కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా జట్టులో ఉన్నాడు. పంజాబ్ జట్టులో వైశాక్ విజయ్ కుమార్ లాంటి భారత ఆటగాడు కూడా ఉన్నాడు. ఈ సీజన్ లో వైశాక్ ఒకే ఒక్క మ్యాచ్ కూడా ఆడాడు. అందులో వైశాక్ బాగా రాణించాడు.
ఫెర్గూస్ ఆటకు దూరం కావడం పంజాబ్కు పెద్ద దెబ్బే..
నవంబర్ 2024 తర్వాత లాకీ ఫెర్గూసన్ కు ఇది మూడో గాయం. ఫిబ్రవరిలో యూఏఈలో జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సందర్భంగా లాకీ ఫెర్గూసన్ ఎదుర్కొన్న తొడ కండరాల గాయం కారణంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. గత ఏడాది చివర్లో శ్రీలంకతో జరిగిన న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు కూడా లాకీ ఫెర్గూసన్ కాలి గాయం కారణంగా దూరమయ్యాడు. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింటిలో 200 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన పంజాబ్ బౌలింగ్ దాడికి లాకీ ఫెర్గూసన్ లేకపోవడం పెద్ద దెబ్బే.