IPL 2025: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025లో పునరాగమనం చేసింది. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ వంటి ఆర్సీబీ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. అదే సమయంలో భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ ఒక కీలక ఐపీఎల్ రికార్డును బద్దలుకొట్టి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు.
ఆర్సీబీ, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 221 పరుగులు చేసింది. అనంతరం 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ముంబై ఇండియన్స్ తడబడింది. కానీ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. చివరికి ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచింది. ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి తిలక్ వర్మ వికెట్ను తీసుకున్నాడు. ఆర్సీబీపై తిలక్ వర్మ అర్థ సెంచరీ సాధించాడు. తిలక్ వర్మ ఔట్ అయిన తర్వాత మ్యాచ్ గమనమే మారిపోయింది. భువీ తిలక్ వర్మను ఔట్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ చాలా హ్యాపీగా కనిపించాడు.

ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు తన ఐపీఎల్ కెరీర్లో 184 వికెట్లు పడగొట్టాడు. ఈ రికార్డుతో భువనేశ్వర్ కుమార్ తన ఐపీఎల్ కెరీర్లో 183 వికెట్లు తీసిన డ్వేన్ బ్రావోను అధిగమించాడు. ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా ఉంది. అయితే బుమ్రా చాలా వెనుకబడి ఉన్నాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల జాబితా ఇదే..
భువనేశ్వర్ కుమార్-184 వికెట్లు
డ్వేన్ బ్రావో - 183 వికెట్లు
లసిత్ మలింగ - 170 వికెట్లు
జస్ప్రీత్ బుమ్రా -165 వికెట్లు
ఉమేష్ యాదవ్ -144 వికెట్లు
10 మ్యాచ్లలో 6 ఓటముల తర్వాత ఆర్సీబీ ముంబై ఇండియన్స్ పై తొలి విజయాన్ని నమోదు చేసింది. 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ(17), ర్యాన్ రికెల్టన్(17) పవర్ ప్లేలో ఔటయ్యారు. విల్ జాక్స్(12), సూర్యకుమార్ యాదవ్(28) కూడా ప్రభావం చూపలేకపోయారు. హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 42) దాదాపు అద్భుత చేశాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 56 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఇద్దరూ త్వరలోనే ఔటయ్యారు. కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, జోష్ హేజిల్వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.