మరి కొన్నినెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. అయితే మెగా ఆక్షన్కు ముహూర్తం ఫిక్స్ చేయడానికి ముందు కొన్ని నిబంధనలను బీసీసీఐ ఖరారు చేయనుంది. రిటైన్డ్ ప్లేయర్ల జాబితాపై పరిమితి, రైట్ టూ మ్యాచ్ కార్డ్ అమలు చేయాలా? వద్దా? అన్క్యాప్డ్, రిటైర్మెంట్ ప్లేయర్లకు సంబంధించిన విధివిధానాలు, ఫ్రాంచైజీల పర్స్ వ్యాల్యూను పెంచడం వంటి నిబంధనలపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.
ఈ నిబంధనలపై క్లారిటీ వచ్చిన తర్వాత ఐపీఎల్ మెగా వేలం తేదీ ఖరారు చేస్తారు. అయితే ప్రస్తుత స్టార్ క్రికెటర్లు, మాజీలు విజ్ఞప్తి మేరకు ఐపీఎల్లో ఓ రెండు రూల్స్ను మార్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. ఈ నిబంధన గురించి పెద్దఎత్తున చర్చ సాగుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి ప్లేయర్లు ఈ రూల్పై బహిరంగంగానే విమర్శించారు. ఈ నిబంధనతో ఆల్రౌండర్ల సేవలను ఎక్కువ ఉపయోగించలేకపోతున్నామని అన్నారు.

మరోవైపు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ పేసర్ జహీర్ ఖాన్ వంటి ఆటగాళ్లు మద్దతు ఇచ్చారు. తమ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఈ నిబంధన ఆల్రౌండర్లకు అడ్డుకాదని వాదిస్తున్నారు. కాగా, ఈ రూల్ వ్యాపారపరంగానూ కలిసొస్తుంది. భారీ స్కోర్లు నమోదవ్వడంతో వీక్షకులు పెరుగుతున్నారు. దీనిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.
ఇక ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లకు అనుమతివ్వడంపై కూడా బీసీసీఐ పునరాలోచనలో ఉంది. ఇది బౌలర్లకు అనుకూలించే నిబంధన. ఈ రెండు నిబంధనలను అమలు చేయాలో వద్దా అని ఫ్రాంచైజీల అభిప్రాయాలు తీసుకుని బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే వాటిని రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, ఈ రూల్స్ను రద్దు చేస్తే.. నవంబర్లో జరగనున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ రద్దు చేస్తారు. దీంతో నవంబర్లోపు ఈ నిబంధనలపై స్పష్టత రానుంది.